లక్నో: ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై కేంద్రం ఐదేళ్లు నిషేధం విధించడంపై శుక్రవారం ఆమె స్పందించారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్నందున కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ట్వీట్లు చేశారు.
‘పీఎఫ్ఐని అనేక విధాలుగా లక్ష్యంగా చేసుకున్న తర్వాత, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ సంస్థ, దానికి చెందిన ఎనిమిది అనుబంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. రాజకీయ స్వార్థంతో తీసుకున్న ఈ చర్య ప్రజలను అశాంతికి గురి చేసింది. ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా లేదని ప్రతిపక్షాలు ఆరోపించడానికి కారణం ఇదే. ఆర్ఎస్ఎస్పై నిషేధాన్ని కూడా వారు (ప్రతిపక్షాలు) కోరుతున్నారు. పీఎఫ్ఐ వల్ల జాతీయ భద్రతకు ముప్పు కలిగితే, ఇలాంటి అనేక సంస్థలపై ఎందుకు నిషేధం విధించకూడదని వారు (ప్రతిపక్షాలు) అడుగుతున్నారు’ అని మాయావతి అందులో పేర్కొన్నారు.
కాగా, కర్ణాటకలో పీఎఫ్ఐపై కేంద్రం నిషేధం విధించడంపై ఆ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఇటీవల స్పందించారు. సమాజంలో శాంతికి ముప్పుగా ఉన్న ఆర్ఎస్ఎస్పై కూడా నిషేధం విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఆర్ఎస్ఎస్పై నిషేధం గురించి పరోక్షంగా ప్రస్తావించారు.