లక్నో : వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)తో బీఎస్పీ పొత్తును ఆ పార్టీ అధినేత్రి మాయావతి స్వాగతించారు. ఎస్ఏడీ-బీఎస్పీ దోస్తీ నూతన రాజకీయ సామాజిక ప్రస్థానానికి శ్రీకారమని, ఇది చారిత్రాత్మక అడుగని ఆమె అభివర్ణించారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ సారథ్యంలోని పాలక సర్కార్ వైఫల్యాలతో దళితులు, రైతులు, యువత, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాయావతి ఆరోపించారు.
పంజాబ్ లో అవినీతి, నిరుద్యోగం, పేదరికం రాజ్యమేలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తమ చారిత్రక కూటమికి పంజాబ్ ప్రజలు మద్దతుగా నిలవాలని ఆమె కోరారు. ఇక ఎస్ఏడీ-బీఎస్పీ పొత్తు నేపథ్యంలో బీఎస్పీ చీఫ్ మాయావతికి ఎస్ఏడీ నేత ప్రకాష్ సింగ్ బాదల్ ఫోన్ చేశారు. మిమ్నల్ని త్వరలో తాము పంజాబ్ కు ఆహ్వానిస్తామని బాదల్ పేర్కొన్నారని మాయావతి వెల్లడించారు.