విక్టోరియా: అత్యధిక జనాభా కోవిడ్ టీకాలు తీసుకున్న సెషెల్స్ లో కరోనా విజృంభణ శాస్త్ర్రవేత్తలను విస్మయానికి గురిచేస్తున్నది. టూరిజం ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న సెషెల్స్ జనాభా సుమారు లక్ష దాకా ఉంటుంది. చైనా విరాళంగా పంపిన సైనోఫామ్ టీకాలను, ఇండియా కానుకగా అందించిన కోవిషీల్డ్ టీకాలను దాదాపు జనాభా అందరికీ వేశారు. కానీ మే 7న కరోనా రోగుల సంఖ్య అంతకుముందు వారం కంటే రెట్టింపు అయ్యింది. ఇదెలా జరిగింది? అక్కడి పరిస్థితిని లోతుగా పరిశీలిస్తే తప్ప టీకా విఫలమైందీ, లేనిదీ, అయితే ఎందుకు అయ్యిందీ చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటున్నది. వైరస్ రకాలు, వ్యాధి తీవ్రత వంటి వివరాలు అందిన తర్వాతే దీనిపై విశ్లేషించగలమని ప్రపంచ ఆరోగ్య సంస్థ టీకాల విభాగం అధికారి కేట్ ఓబ్రయన్ చెప్పారు. సెషెల్స్ తో సంప్రదింపులు జరుపుతున్నామని ఆమె వివరించారు. ఈలోగా ప్రభుత్వం బడులు మూసివేసి ఆటలపోటీల వంటి ఈవెంట్లను నిషేధించింది. సామాజిక దూరం పాటించాల్సిందిగా ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది. సెషెల్స్ కరోనా పాజిటివ్ సంఖ్య 2,486 కు చేరుకుంది. అందులో 37 శాతం మంది రెండు వ్యాక్సిన్లు తీసుకున్నవారే కావడం గమనార్హం.