న్యూఢిల్లీ : ఇంజినీరింగ్ విద్య అభ్యసించేందుకు ఇకపై 10+2 స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు తప్పనిసరి కాదని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యూకేషన్(ఏఐసీటీఈ) పేర్కొంది. ఏఐసీటీఈ ఇటీవల 2021-22 సంవత్సరానికి ఆమోదిత హ్యాండ్బుక్ను విడుదల చేసింది. బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు 12వ తరగతి స్థాయిలో మాథ్స్(గణితం), ఫిజిక్స్(భౌతికశాస్త్రం) సబ్జెక్టులను ఆప్షనల్(ఐచ్చికం) చేసింది. ఇప్పటివరకు ఇంజనీరింగ్, టెక్నాలజీలో, అండర్ గ్రాడ్యూయేట్ ప్రొగ్రామ్స్లో ప్రవేశం పొందేందుకు మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరి సబ్జెక్టులుగా ఉన్న విషయం తెలిసిందే. ఏఐసీటీఈ దీన్ని ఇప్పుడు ఆప్షనల్ చేసింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు పొందగోరే విద్యార్థులు 10+2 స్థాయిలో ఈ క్రింది మూడు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైతే సరిపోతుందంది.
ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయాలజీ, ఇన్ఫర్మేటిక్స్ ప్రాక్టిసెస్, బయో టెక్నాలజీ, టెక్నికల్ ఒకేషనల్ సబ్జెక్ట్, అగ్రికల్చర్, ఇంజినీరింగ్ గ్రాఫిక్స్, బిజినెస్ స్టడీస్, ఎంటర్ప్రెన్యూర్షిప్.
పైన పేర్కొన్న సబ్జెక్టుల్లో జనరల్ అభ్యర్థులు 45 శాతం, రిజర్వు కేటగిరి అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుందని ఏఐసీటీఈ పేర్కొంది. కాగా ఇంజినీరింగ్ కోర్సుకు ఫిజిక్స్, మ్యాథ్స్ పూర్తిగా అవసరమని చాలా మంది నిపుణులు పేర్కొన్నారు. ఏఐసీటీఈ తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా కోరారు. ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ డి సహస్రబుధే స్పందిస్తూ.. ఈ చర్య జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా సౌలభ్యాన్ని ఇస్తుందన్నారు. అయితే ఇంజినీరింగ్ను అర్థం చేసుకోవడానికి ఫిజిక్స్, మ్యాథ్స్ ముఖ్యమని ఆయన కూడా అంగీకరించారు. లేకపోతే విద్యార్థులకు చాలా బ్రిడ్జి కోర్సులు అవసరమౌతాయన్నారు.