డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలోని దౌలీగంగా నదిలో వచ్చిన ఉప్పెనకు సంబంధించిన నివేదికను రిలీజ్ చేశారు. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటేన్ డెవలప్మెంట్(ఐసీఐఎంఓడీ) శాస్త్రవేత్తలు ఆ ఘటన పట్ల రిపోర్ట్ ఇచ్చారు. భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడడం వల్ల దౌలీగంగా, రిషి గంగా, అలకనంద నదుల్లో ఆకస్మిక వరద వచ్చినట్లు ఆ నివేదికలో తెలిపారు. ఆ వరదల్లో సుమారు 70 మంది మృతిచెందారు. మరో 125 మంది ఆచూకీ లేకుండాపోయారు. రోంటీ పర్వతశ్రేణి వద్ద ఉన్న భారీ రాళ్లు, కొండచరియలు విరిగిపడడం వల్ల .. ఆ ధాటికి అక్కడ ఉన్న మంచు కరిగిపోయిందని, దాని వల్లే భీకర రీతిలో వరదలు వచ్చినట్లు రిపోర్ట్లో పేర్కొన్నారు. మంచుగడ్డతో మిక్స్ అయిన ఉన్న సుమారు 22 మిలియన్ల క్యూబిక్ మీటర్ల రాళ్లు పడిపోవడంతో పాటు.. అప్పటికే ఆ లోయలో పేరుకుపోయిన మంచు వల్ల.. భారీ ఉప్పెన వచ్చినట్లు స్టడీ పేర్కొన్నది. అకస్మాత్తుగా కురిసిన కొండచరియలతో నీరు ఉప్పొంగిందని, దాంతో ఉదృతమైన వరద వచ్చినట్లు ఐసీఐఎంఓడీ తన రిపోర్ట్లో పేర్కొన్నది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న గ్రామాలతో కనెక్టివిటీ పెంచేందుకు ప్రత్యామ్నాయంగా రిషిగంగా నదిపై బెయిలీ బ్రిడ్జ్ను నిర్మించారు. ఫిబ్రవరి 25వ తేదీన ఆ బ్రిడ్జ్పై పనులు ప్రారంభం అయ్యాయి. నిజానికి మార్చి 20వ తేదీ ఆ పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఓవర్టైమ్ పనిచేయడంతో బ్రిడ్జ్ త్వరగా పూర్తి అయ్యింది. శుక్రవారం ఆ బ్రిడ్జ్ను ఓపెన్ చేశారు.