హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వరంగ విద్యుత్తు సంస్థలను కార్పొరేట్లకు ధారాదత్తం చేసే విద్యుత్తు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా శుక్రవారం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నేతలు తెలిపారు. 22 సంఘాలతో కూడిన జేఏసీ ఆధ్వర్యంలో మింట్కాంపౌండ్ నుంచి ఖైరతాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ వరకు భారీ ర్యాలీ, అనంతరం ఉద్యోగుల సదస్సు నిర్వహిస్తామని వివరించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జేఏసీ నేతలు పీ రత్నాకర్రావు, సాయిబాబు, శ్రీధర్ తదితరులు సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు. సదస్సుకు ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు శైలేంద్ర దూబే, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ సెక్రటరీ జనరల్ మోహన్శర్మ, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ సెక్రటరీ జనరల్ అభిమన్యు దన్కర్, అశోక్రావు, పలువురు రైతు నాయకులు పాల్గొంటారని రత్నాకర్రావు వెల్లడించారు.