న్యూఢిల్లీ : ఆగస్ట్లో కార్ల అమ్మకాలు పడిపోయాయని మారుతి సుజుకి వెల్లడించగా టాటా మోటార్స్, స్కోడా వంటి మరికొన్ని కంపెనీలు తమ వాహనాల విక్రయాలు పెరిగాయని ప్రకటించాయి.ఇక భారత్లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఆగస్ట్ మాసంలో కార్ల విక్రయాలు 8.71 శాతం తగ్గాయని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా చిప్ కొరత వెంటాడటంతో అది ఉత్పత్తిపై ప్రభావం చూపిందని ఫలితంగా సేల్స్ నెంబర్లు పడిపోయాయని తెలిపింది.
గత ఏడాది ఆగస్ట్లో మారుతి 1,13,033 వాహనాలను విక్రయించగా ఈ ఏడాది ఆగస్ట్లో 1,03,187 వాహనాలను విక్రయించింది. ఎస్ ప్రెసో, అల్టో కార్ల అమ్మకాలు పెరగ్గా, వాగన్ఆర్, డిజైర్, స్విఫ్ట్, సెలెరియో, బాలెనో కార్ల సేల్స్ తగ్గాయని మారుతి పేర్కొంది. మరోవైపుఎస్-క్రాస్, బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్ఎల్ 6 వంటి యుటిలిటీ వాహనాల సేల్స్ కూడా ప్రోత్సాహకరంగా ఉన్నాయని తెలిపింది.
ఇక ఆగస్ట్లో తమ కార్ల విక్రయాలు ఏకంగా 48 శాతం వృద్ధి చెందాయని టాటా మోటార్స్ వెల్లడించింది. గత ఏడాది ఆగస్ట్లో 18,227 వాహనాలను తాము విక్రయించగా గత నెలలో ఏకంగా 26,996 కార్లు అమ్ముడుపోయాయని తెలిపింది. ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ 234 శాతం ఎగబాకిందని వెల్లడించింది. ఇక స్కోడా కూడా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆగస్ట్లో బంపర్ సేల్స్ నమోదయ్యాయని తెలిపింది. బ్రిటన్ కార్ల దిగ్గజం ఎంజీ సైతం భారత్లో ఆగస్ట్లో తమ వాహనాల విక్రయం 51 శాతం పెరిగిందని పేర్కొంది.