Maruti New Brezza | కార్ల మార్కెట్పై తిరిగి పట్టు బిగించడమే లక్ష్యంగా మారుతి సుజుకి అడుగులేస్తున్నది. అందులో భాగంగా కంపాక్ట్ ఎస్యూవీ మోడల్ కారు న్యూ-బ్రెజాను గురువారం ఆవిష్కరించింది. దీని ధర రూ.7.99 లక్షల నుంచి మొదలవుతుంది. ఎస్యూవీ విభాగంలో బలోపేతం కావడం ద్వారా తిరిగి దేశీయ కార్ల మార్కెట్పై పట్టు సాధించాలని భావిస్తున్నది. రెండో తరం బ్రెజా కారు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు ధర రూ.7.99 లక్షల నుంచి రూ.13.96 లక్షల మధ్య ఉంటుంది.
గత ఎనిమిది నెలల్లో ఆరో ఆవిష్కరణ ఆల్ న్యూ బ్రెజా కారు అని మారుతి సుజుకి ఇండియా డైరెక్టర్ హిషాషి టాకేజీ చెప్పారు. భారత్ మార్కెట్పై తమకు ఉన్న విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తుందన్నారు. ఎస్యూవీ పోర్ట్ఫోలియోపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. అన్ని సెగ్మెంట్లలోనూ బలోపేతం కావాలని మారుతి సుజుకి భావిస్తున్నదన్నారు. `జాయ్ ఆఫ్ మొబిలిటీ` విజన్తో సాధ్యమైనంత ఎక్కువ మందికి చేరువ కావడమే లక్ష్యం అన్నారు.
నూతన భారతావని ఆకాంక్షలకు ప్రతిబింబంగా టెక్నాలజీ, ఫీచర్లతోకూడిన అత్యున్నత స్థాయి డిజైన్లతో కూడిన కార్లను ప్రవేఫెడుతున్నట్లు హిషాషి టాకేజీ తెలిపారు. ఈ దిశగా ఆల్న్యూ బ్రెజా ఆవిష్కరణ చాలా ముఖ్యమైన చర్య అని చెప్పారు. ఆరేండ్ల క్రితం ఆవిష్కరించిన బ్రెజా మోడల్ కారు ఇప్పటి వరకు 7.5 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి.
రెండో తరం న్యూ-బ్రెజా కారు నెక్స్ట్ జనరేషన్ కే సిరీస్ 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్, లీటర్ పెట్రోల్పై 20.15 కి.మీ మీటర్ల మైలేజీతో స్మార్ట్ హైబ్రీడ్ టెక్నాలజీతో వస్తున్నది. మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఎలక్ట్రిక్ సన్రూఫ్, హెడ్ అప్ డ్ప్లే, డిజిటల్ 360 కెమెరా, 40 కనెక్టెడ్ ఫీచర్లతో న్యూ-బ్రెజా వస్తున్నది. హల్హోల్డ్ అసిస్ట్, 6 ఎయిర్బ్యాగులోపాటు 20కి పైగా సేఫ్టీ ఫీచర్లు జత చేశారు.
దక్షిణ కొరియా కార్ల తయారీ దారులు హ్యుండాయ్ వెన్యూ, కియా మోటార్స్ సోనెట్ నుంచి ఎస్యూవీ క్యాటగిరీలో గట్టి పోటీ ఎదురవుతుండటంతో న్యూ బ్రెజా కారును మారుతి సుజుకి ఆవిష్కరించింది. చిన్న కార్ల మార్కెట్లో మారుతి షేర్ కుంచించుకు పోతున్నది. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో చిన్న కార్ల మార్కెట్ దాదాపు 50 శాతం 43.4 శాతానికి పడిపోయింది.