గురుగ్రామ్: మారుతీ సుజుకీలో శిక్షణ పొందుతున్న ఒక యువకుడు అనుమానాస్పదంగా మరణించాడు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు నకిలీ డాక్టర్ను అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని హర్యానాకు చెందిన గురుగ్రామ్లో ఈ సంఘటన జరిగింది. రాజస్థాన్ చురు జిల్లాలోని జాంద్వా గ్రామానికి చెందిన 20 ఏళ్ల లీలాధర్, మారుతీ సుజుకి ఇండియా సంస్థకు చెందిన ఐఎంటీ ప్లాంట్లో శిక్షణ పొందుతున్నాడు. సమీపంలోని అలియార్ గ్రామంలో పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో నివసిస్తున్నాడు.
కాగా, లీలాధర్ అనుమానాస్పదంగా మరణించాడు. మంగళవారం ఆ వసతి గృహం సమీపంలో అతడి మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో లీలాధర్ మరణంపై కుటుంబ సభ్యుడు రామావతార్ అనుమానం వ్యక్తం చేశాడు. లీలాధర్ నివసించిన పెయింగ్ గెస్ట్ రూమ్కు చేరుకున్నాడు. అక్కడి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించాడు. స్థానికంగా డాక్టర్గా చెలామణి అవుతున్న ఉత్తరప్రదేశ్లోని అమ్రోహాకు చెందిన ఫయీమ్, మరో వ్యక్తి సహాయంతో లీలాధర్ మృతదేహాన్ని ఆ వసతి గృహం సమీపంలో పడేసినట్లు సీసీటీవీలో రికార్డైంది.
దీంతో రామావతార్ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. నకిలీ వైద్యుడు ఫయీమ్ను అరెస్ట్ చేశారు. అతడి క్లీనిక్కు వచ్చిన లీలాధర్కు ఆ నకిలీ డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చి అక్కడ పడుకోవాలని చెప్పాడు. దీంతో ఇంజక్షన్ వికటించడంతో ఆ యువకుడు మరణించాడు. ఈ నేపథ్యంలో స్నేహితుడు సుభాన్తో కలిసి లీలాధర్ మృతదేహాన్ని వసతి గృహం సమీపంలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన నకిలీ వైద్యుడికి ఎలాంటి వైద్య డిగ్రీ లేదన్నారు. అతడికి సహకరించిన స్నేహితుడి కోసం వెతుకుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.