న్యూఢిల్లీ: కరోనా తర్వాత పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం పెరిగింది. లాక్డౌన్ నిబంధనలను సడలిస్తున్నా కొద్దీ ఆటోమొబైల్స్ సేల్స్ కమ్రంగా పుంజుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో కార్లు, మోటారు సైకిళ్లు, స్కూటర్ల విక్రయాలు దూసుకెళ్లాయి. దేశీయ కార్ల తయారీ దిగ్గజ కంపెనీలైన మారుతి సుజుకీ, హ్యుండాయ్, టాటా మోటార్స్ గణనీయంగా అమ్మకాలు సాగించాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్, మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ అమ్మకాలు కూడా పుంజుకున్నాయి. కరోనాకు తోడు గతేడాది ఏప్రిల్ నుంచి బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాల తయారీ వాటి విక్రయాలపై ప్రభావం కనిపించింది. తర్వాతర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి.
గత నెలలో దేశంలోకెల్లా అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ మార్చిలో మొత్తం 1,49, 518 వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో అమ్మిన 76,976 యూనిట్లతో పోలిస్తే ఇది 94 శాతం అధికం. కానీ 2019తో పోలిస్తే గతేడాది సేల్స్ కరోనా వల్ల 48 శాతం తగ్గుముఖం పట్టాయి.
మినీ కార్లుగా పేరొందిన ఆల్టో అండ్ ఎస్-ప్రెస్సోమోడల్ కార్లు 24,653 యూనిట్లు అమ్ముడు పోగా, 2020 మార్చిలో 15,988 యూనిట్లకు పరిమితం అయ్యాయి. అలాగే స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ సేల్స్ 82,201 యూనిట్లు జరిగితే, 2020లో 40,519 యూనిట్లతో సరిపెట్టుకున్నట్లు మారుతి తెలిపింది.
విటారా బ్రెజా, ఎస్-క్రాస్, ఎర్టిగా మోడల్ కార్లు 26,174 యూనిట్లు అమ్ముడయ్యాయని మారుతి పేర్కొంది. ఇదే దేశీయ అమ్మకాలు ఆర్థిక సంవత్సరం 2019–20లో 14,36,124 యూనిట్లుగా నమోదుకాగా, ఆర్థిక సంవత్సరం 2020–21లో 13,23,396 యూనిట్లకు పరిమితం అయ్యాయి.
ఇదే నెలలో దేశీయ వాహన విక్రయాల్లో 100 శాతం వృద్ధిని సాధించినట్లు హ్యుండాయ్ ప్రకటించింది. గతేడాది మార్చిలో 26,300 యూనిట్లను విక్రయించగా, ఈసారి అమ్మకాలు 52,600 యూనిట్లకు చేరుకున్నాయి. క్రెటా, వెన్యూ, వెర్నా, నియోస్తోపాటు ఆల్ న్యూ ఐ20 మోడల్ సేల్స్ కీలకంగా మారాయని హ్యుండాయ్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ అండ్ సర్వీస్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ తెలిపారు.
టాటా మోటార్స్ సేల్స్లో అనూహ్యంగా 422 శాతం గ్రోత్ నమోదు చేసింది. ప్యాసింజర్ వాహనాల విభాగంలో గతేడాది 5,676 యూనిట్లు అమ్ముడైతే ఈ ఏడాది మొత్తం 29,654 యూనిట్లను విక్రయించింది.
ఇదే మార్చిలో టయోటా కిర్లోస్కర్ మోటార్స్ 15,001 వాహనాలను విక్రయించింది. గతేడాది మార్చిలో అమ్మకాలు 7,023 యూనిట్లుగా ఉన్నాయి. మహీంద్రా మార్చిలో మొత్తం 16,700 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో మొత్తం అమ్మకాలు 3,383 యూనిట్లుగా ఉన్నాయి.
బొలెరో, స్కార్పియో, ఎక్స్యూవీ300, ఆల్–న్యూ థార్ వంటి మోడళ్లు ఆశించిన స్థాయిలో అమ్ముడయ్యాయని మహీంద్రా ఆటోమోటివ్ డివిజన్ సీఈవో విజయ్ నక్రా తెలిపారు. గతేడాది మార్చిలో లాక్డౌన్ వల్ల అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయినా గతనెలలో విక్రయాలు ఇంతలా పెరగడానికి బేస్ ఎఫెక్ట్ కారణమని పరిశీలకులు పేర్కొంటున్నారు.
టూ వీలర్ సెగ్మెంట్లో హీరోమోటో కార్ప్ గతేడాది 3,16,685 యూనిట్లు విక్రయిస్తే, గత నెలలో 5,44,340 యూనిట్లకు విక్రయించింది. టీవీఎస్ మోటార్స్ గత నెలలో టూవీలర్స్ 2,02,155 యూనిట్లు విక్రయించింది. రాయల్ ఎన్ఫీల్డ్ 60,173 బైక్స్ సేల్ అయ్యాయి.
బ్లడ్ క్యాన్సర్.. లక్షణాలు ఎలా ఉంటాయి.. చికిత్స ఏంటి..?
సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సేంద్రియ వ్యవసాయం
ఫ్యూచర్కు లైఫ్లైన్.. డీల్ అమలుకు రిలయన్స్ 6 నెలల టైం!