Festive Discounts on Cars | వచ్చే పండుగల సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు ఆటోమొబైల్ దిగ్గజాలు పోటీ పడబోతున్నాయి. వివిధ శ్రేణులతో కూడిన వాహనాలపై డిస్కౌంట్లు, ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుండాయ్ తదితర కార్ల తయారీ సంస్థలు. ప్రధానంగా ఎంట్రీ లెవల్ కార్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నాయి.
సాంత్రో, ఐ10 నియోస్, ఔరా, ఐ20, ఎక్స్సెంట్, కొనా ఈవీ వంటి వివిధ మోడల్ కార్లపై దక్షిణ కొరియా ఆటో మేజర్ హ్యుండాయ్ క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బెనిఫిట్లు, అదనపు ఇన్సెంటివ్లు అందించనున్నాయి. ఆయా మోడల్ కార్లపై రూ.13 వేల నుంచి రూ.50 వేల వరకు రాయితీ అందిస్తున్నాయి.
ఇక దేశీయ ఆటోమొబైల్ జెయింట్ మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఎక్స్యూవీ300, బొలెరో, బొలెరో నియో వంటి మోడల్ కార్లపై పలు ఇన్సెంటివ్లు, ఆఫర్లు అందిస్తాయి. అతిపెద్ద ఆటో మేజర్ మారుతి సుజుకిలో ఎంపిక చేసిన మోడల్ కార్లు ఎస్-ప్రెస్సో, ఆల్టో800, స్విఫ్ట్, సెలెరియో వంటి వేరియంట్ కార్లపై రూ.9000-60,0000 వరకు డిస్కౌంట్లు అందిస్తున్నది.
గత కొన్ని నెలలుగా తమ ప్రొడక్షన్ ప్లాంట్లలో 95 శాతం ఉత్పత్తి చేయాలని ప్రణాళిక వేశాం అని మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్కు అనుగుణంగా కార్ల ఉత్పత్తి చేయడం కార్ల తయారీ సంస్థలకు పెద్ద సవాల్ కానున్నదన్నారు.
మరో దేశీయ ఆటోమొబైల్ మేజర్ టాటా మోటార్స్ సైతం టియాగో, టైగోర్, నెక్సాన్, సఫారీ వంటి మోడల్ కార్లపై రూ.40 వేల వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. కేరళలో ఓనం వేడుకల నుంచి డిస్కౌంట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. గత రెండేండ్లుగా కార్లకు చాలా ఎక్కువగా డిమాండ్ ఉంది. కానీ వివిధ కారణాల రీత్యా కార్ల సరఫరాలో వ్యత్యాసం నెలకొందని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ మార్కెటింగ్ అండ్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ అంబా తెలిపారు. రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు రాయితీలు కల్పిస్తున్నట్లు చెప్పారు.