న్యూఢిల్లీ : ఆర్ధిక మాంద్యం భయాలతో టెక్ దిగ్గజాలు సైతం వ్యయ నియత్రణ చర్యలు చేపడుతున్నాయి. ఉద్యోగ నియామకాలను నిలిపివేయడంతో పాటు సామర్ధ్యం సరిగా లేదనే సాకుతో పెద్ద సంఖ్యలో టెకీలను సాగనంపేందుకూ సిద్ధమవుతున్నాయి. కంపెనీలో ఉత్పాదకత పడిపోయిందని సెర్చింజన్ దిగ్గజం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వ్యాఖ్యలు చేయడంతో పాటు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ఉద్యోగులను హెచ్చరించాడు. తాజాగా మరో టెక్ దిగ్గజం మెటా (ఫేస్బుక్) సీఈఓ మార్క్ జుకర్బర్గ్ ఉద్యోగులపై మరో బాంబు పేల్చాడు.
ఇక్కడ పనిచేయతగని ఉద్యోగులు కంపెనీలో చాలా మంది ఉన్నారని జుకర్బర్గ్ వ్యాఖ్యలు టెకీల్లో గుబులు రేపాయి. గూగుల్లో ఒక్కో ఉద్యోగి ఉత్పాదకత రేటు తక్కువగా ఉందని సున్నితంగా సుందర్ పిచాయ్ హెచ్చరిస్తే ఉద్యోగులు పనిచేయకుండా ఎంజాయ్ చేస్తున్నారనేలా జుకర్బర్గ్ ఘాటు వ్యాఖ్యలే చేశారని చెబుతున్నారు. సిలికాన్ వ్యాలీలో టెక్ కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యలు చేపడుతున్న నేపధ్యంలో పిచాయ్, జుకర్బర్గ్ ఉద్యోగులకు వార్నింగ్ ఇవ్వడం దేనికి సంకేతమనే చర్చ నడుస్తోంది. దిగ్గజ టెక్ సీఈఓల వ్యాఖ్యలతో సిలికాన్ వ్యాలీలో గత కాలపు వైభవాల రోజులు కనుమరుగయ్యాయని వెల్లడవుతోంది.
ఉద్యోగులకు ప్రోత్సాహకాలు, వలసల నిరోధానికి ఇచ్చే అలవెన్సులు, ఇతర రాయితీలకు ఇక కాలం చెల్లినట్టేనని చెబుతున్నారు. ఈ ఏడాది నియామకాలకు పిచాయ్, జుకర్బర్గ్ ఇప్పటికే బ్రేకులు వేశారు. ఉద్యోగులకు అదనపు వెకేషన్ డేస్ను మెటా రద్దు చేసింది. పరిస్ధితులు మెరుగుపడకపోతే ఉద్యోగులపై వేటు వేసేందుకు దిగ్గజ టెక్ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఆర్ధిక మందగమనం, రష్యా-ఉక్రెయిన్ల యుద్ధంతో పాటు ఇన్వెస్టర్ల నుంచి ఒత్తిళ్లతో టెక్ దిగ్గజాలు గడ్డు పరిస్ధితిని ఎదుర్కొంటున్నాయి. జూన్ క్వార్టర్లో మెటా తొలిసారిగా రాబడిలో తగ్గుదలను నమోదు చేసింది. మరోవైపు గూగుల్ సైతం ఆర్ధిక ఫలితాల్లో అంచనాలను అందుకోలేకపోయింది.