ముంబై : లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్యం స్వల్పంగా మెరుగుపడిందని, అయితే ఐసీయూలోనే ఉన్నారని ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు. కొవిడ్కు పాజిటివ్గా తేలడంతో లతామంగేష్కర్ ఈ నెల 8న దక్షిణ ముంబైలోని బ్రీచ్ క్యాండి హాస్పిటల్లో చికిత్స కోసం చేరారు. అప్పటి నుంచి ఐసీయూలో ఉంచి ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్స్ను దవాఖాన యాజమాన్యం అందిస్తూనే వస్తున్నది.
లతా మంగేష్కర్ కోలుకోవాలని అభిమానులు దేవుడ్ని వేడుకోవాలంటూ ఆమెకు వైద్యం చేస్తున్న డాక్టర్ ప్రతీత్ సందాని ఇటీవల తెలిపారు. అయితే, రెండువారాలకుపైగా ఆమె ఐసీయూలోనే ఉండడంతో రూమర్లు మొదలవగా.. సోషల్ మీడియాలో లతాజీ ఆరోగ్యానికి సంబంధించి తప్పుడు ప్రచారం జరుగుతోంది. దీంతో లతా కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. లతామంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి గురించి తప్పుడు వార్తలు వ్యాప్తి చేయొద్దని లతాజీ అధికారిక ట్విట్టర్ ద్వారా కోరారు.