బాదుడే పరమావధిగా క్రీజులో అడుగుపెట్టిన ఆల్రౌండర్ స్టొయినిస్.. లంక బౌలర్లను చీల్చి చెండాడడంతో పొట్టి ప్రపంచకప్లో ఆతిథ్య ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్లో కివీస్ చేతిలో ఓడి డీలా పడ్డ కంగారూలు.. లంకేయులపై ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టారు. అప్పటి వరకు కాస్తో కూస్తో పోటీనిచ్చిన లంక.. స్టొయినిస్ రాకతో చేసేదిలేక చేతులెత్తేసింది. మైదానం నలువైపులా బౌండ్రీలతో విరుచుకుపడ్డ ఈ ఆల్రౌండర్ ఆస్ట్రేలియా తరఫున వేగవంతమైన అర్ధశతకం (17 బంతుల్లో) తన పేరిట రాసుకున్నాడు.
పెర్త్: ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్ (18 బంతుల్లో 59 నాటౌట్; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) రికార్డు అర్ధశతకంతో చెలరేగడంతో టీ20 ప్రపంచకప్లో ఆతిథ్య ఆస్ట్రేలియా తొలి విజయం నమోదు చేసుకుంది. టోర్నీ ఆరంభ పోరులో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైన ఆసీస్.. మంగళవారం జరిగిన పోరులో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. పతుమ్ నిశాంక (40), చరిత అసలంక (38 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఆసీస్ బౌలర్లలో హజిల్వుడ్, కమిన్స్, స్టార్క్, అగర్, మ్యాక్స్వెల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్ 16.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది.
కెప్టెన్ ఆరోన్ ఫించ్ (31) నిదానంగా ఆడినా.. స్టొయినిస్ లంకేయులకు చుక్కలు చూపాడు. బంతి ఎక్కడ వేసినా దాని గమ్యస్థానం బౌండ్రీనే అన్న చందంగా చెలరేగిపోవడంతో కంగారూ జట్టు మరో 21 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాక్స్వెల్ (23; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మిషెల్ మార్ష్ (18) కూడా ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. లంక బౌలర్లలో ధనంజయ, చమిక, తీక్షణ తలా ఒక వికెట్ తీశారు. అంతర్జాతీయ టీ20ల్లో ఆస్ట్రేలియా తరఫున వేగవంతమైన అర్ధశతకం (17 బంతుల్లో) నమోదు చేసిన స్టొయినిస్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. కాగా.. మంగళవారం నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో బంగ్లా విజయం సాధించగా.. దక్షిణాఫ్రికా, జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపాకు కరోనా పాజిటివ్గా తేలడంతో ఈ మ్యాచ్లో ఆడలేదు.