అహ్మదాబాద్, ఆగస్టు 23: గుజరాత్లోని రంధిక్పుర్ గ్రామంలోని ముస్లిం కుటుంబాలు ఆ ఊరిని విడిచిపెట్టి వెళ్లిపోతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో రేప్ కేసులో 11 మంది దోషులను అక్కడి బీజేపీ ప్రభుత్వం గత వారం విడుదల చేయడమే ఈ వలసలకు కారణం. ‘ఊరిలో ఇంకా ఉంటే మా ఆడబిడ్డలకు రక్షణ కల్పించలేం. అందుకే దాహోద్ జిల్లాలోని రహీ-మబాద్ రిలీఫ్ కాలనీకి వలస వెళ్తు’న్నట్టు పదుల సంఖ్యలో ముస్లిం కుటుంబాలు చెప్పాయి. రిలీఫ్ కాలనీకి చేరుకున్న బాధితులను జాతీయ మీడియా సంస్థ ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ పలకరించింది. ఈ క్రమంలో వాళ్లు పంచుకున్న ఆవేదన.. వారి మాటల్లోనే..
అపూర్వ స్వాగతం భయపెట్టింది
దోషులను విడుదల చేశారన్న విషయం తెలియగానే మాలో భయం మొదలైంది. ఇప్పటివరకైతే వాళ్లు (దోషులు) మమ్మల్ని ప్రత్యక్షంగా బెదిరింపులకు గురిచేయలేదు. అయితే, విడుదల సమయంలో దోషులకు లభించిన అపూర్వ స్వాగతం, కొందరు అట్టహాసంగా జరిపించిన సంబురాలు మమ్మల్ని భయపెడుతున్నాయి. దోషులు పెరోల్పై బయటకు రావడాన్ని సాధారణంగా పరిగణించేవాళ్లం. అయితే, వాళ్లను ఏకంగా విడుదల చేశారు. బిల్కిస్ రేప్ ఘటన జరిగిన గ్రామం (రంధిక్పుర్) మాకు ఎంత మాత్రం సురక్షితం కాదు.
–సుల్తానా, గ్రామస్థురాలు
సానుకూల తీర్పు వస్తుందని భావిస్తున్నాం
దోషులకు శిక్ష పడాలని బిల్కిస్ ఎంతో పోరాడింది. అయితే ఇప్పుడు వాళ్లంతా విడుదలయ్యారు. దీనిపై కోర్టును ఆశ్రయించాం. సానుకూలమైన తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం.
–బిల్కిస్ భర్త యాకూబ్ రసూల్
కాలనీల్లో, మార్కెట్లో వాళ్లే..
మా అక్కా, చెల్లెళ్లుకు, అత్తమ్మ, పెద్దమ్మలకు చేసిన అన్యాయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా.. వాళ్లను (దోషులను) విడుదల చేశారు. ఇప్పుడు గ్రామంలోని ప్రతీ కాలనీలో, మార్కెట్లో వాళ్లు కలియదిరుగుతున్నారు. ఇది ఎలా ఉన్నదంటే, మేమేం చేసినా మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని వాళ్లు గర్వంతో చెప్పినట్టు కనిపిస్తున్నది. భార్య, బిడ్డతో ఇంటిని విడిచిపెట్టడం తప్ప నాకు వేరే మార్గం కనిపించడంలేదు.
–బిల్కిస్కు వరుసకు సోదరుడు
ఆ గ్యారంటీ ఉందా?
దోషులను విడుదల చేశారు. అయితే, వాళ్లు మునుపటి నేరాలను తిరిగి చేయబోరన్న గ్యారంటీ ఉందా?
–సబేరా పటేల్, దోషుల్లో ఇద్దరిపై కేసు వేసిన వ్యక్తి
దోషుల విడుదలపై సుప్రీంలో పిటిషన్
బిల్కిస్ బానో సామూహిక లైంగిక దాడి కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు మంగళవారం సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అపర్ణ భట్ దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం లిస్టింగ్కి అనుమతించింది. సిబల్ మాట్లాడుతూ.. తాము సుప్రీంకోర్టు ఆదేశాలను సవాల్ చేయట్లేదని, దోషుల విడుదలకు అనుసరించిన నిబంధనలను మాత్రమే సవాల్ చేస్తున్నట్టు ధర్మాసనానికి వెల్లడించారు.
తిరుగుముఖం అందుకే..
బిల్కిస్ ఉదంతం జరిగాక, 2004లో రంధిక్పుర్ గ్రామం నుంచి దాదాపు 74 కుటుంబాలు రిలీఫ్ కాలనీకి మారాయి. అయితే, దోషులకు శిక్ష పడిందని తెలియగానే, మళ్లీ సొంతూరుకు వచ్చేశాం. ఇప్పుడు మాలో మళ్లీ భయం మొదలైంది. అందుకే రిలీఫ్ కాలనీకి తిరుగుముఖం పట్టాం.
–అబ్దుల్ రజాక్, గ్రామస్థుడు