బాలీవుడ్లో స్థిరపడేందుకు శ్రమిస్తున్నది అందాల తార మానుషీ చిల్లర్. 2017లో ప్రపంచ సుందరి కిరీటం గెల్చుకున్న మానుషీ..ఆ తర్వాత నాయికగా బాలీవుడ్లో తెరంగేట్రం చేసింది. అక్షయ్ కుమార్ సరసన ‘పృథ్వీరాజ్’ చిత్రంలో నటించింది. ఈ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడం ఆమెను నిరాశపర్చింది. ఒక్క ఫ్లాప్ కెరీర్ను ఆపలేదన్నట్లు..ఆమెకు అవకాశాలు అడుగంటిపోలేదు. ప్రస్తుతం ‘గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’ సినిమాతో పాటు జాన్ అబ్రహాంతో కలిసి ‘టెహ్రాన్’ అనే చిత్రంలో నటిస్తున్నది మానుషీ. ఈ సినిమా కోసం అహర్నిశలు శ్రమిస్తున్నదీ తార. 15 రోజులు పూర్తిగా రాత్రిళ్లు షూటింగ్ చేసింది. ఈ విషయంపై మానుషీ మాట్లాడుతూ…‘ఢిల్లీ, ముంబై, బ్రిటన్లోని గ్లాస్గో…ఇలా వివిధ నగరాల్లో అవిశ్రాంతంగా షూటింగ్ చేస్తున్నాం. నా క్యారెక్టర్ పోర్షన్ వరకు కేవలం రాత్రుళ్లు 15 రోజుల పాటు చిత్రీకరణ చేసాం. ఇలా నైట్ షూట్స్ చేయడం నాకిదే తొలిసారి. కెరీర్ ప్రారంభంలో ఉన్నా కాబట్టి నటిగా అన్ని సందర్భాల్లో నటించేందుకు సిద్ధంగా ఉండాలి. మంచి క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకుల అభిమానం పొందాలని ఉంది’ అని చెప్పింది.