మణిపూర్ : వచ్చే ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు గోవిందాస్ కొంతౌజాం రాజీనామా చేశారు. పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన అధికార బీజేపీ పార్టీలో చేరనున్నారు. బిష్ణుపూర్ నుంచి వరుసగా ఆరుసార్లు ఎన్నికైన గోవిందాస్ను మణిపూర్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా సోనియా గాంధీ గతేడాది డిసెంబర్లో నియమించారు. 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. 2017లో తొలిసారిగా బీజేపీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాబోయే ఎన్నికల్లోనూ అధికారాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
2017 ఎన్నికల్లో అధికార పార్టీ కంటే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధించినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 31 సీట్లను గెలువలేకపోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 28, బీజేపీ 21, ఎన్పీఎఫ్, ఎన్పీపీ నాలుగు సీట్లు సాధించాయి. 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్లో ప్రస్తుతం 56 మంది సభ్యులున్నారు. బీజేపీకి 25 మంది సభ్యులు, కాంగ్రెస్కు 17 మంది సభ్యుల బలం ఉన్నది. ఎన్పీపీ, ఎన్పీఎఫ్కు నలుగురు సభ్యులున్నారు. తృణమూల్ కాంగ్రెస్కు ఒక ఎమ్మెల్యే, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. సభలో ప్రస్తుతం నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎన్పీపీ, ఎన్పీఎఫ్, ముగ్గురు స్వతంత్రుల సహకారంతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం కూటమిలో 36 మంది ఎమ్మెల్యేలున్నారు.