‘నా మీద వస్తున్న ట్రోల్స్ గురించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశా. వాళ్లు విచారణ చేపట్టారు. 18 యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా విచారణ జరుగుతున్నది’ అని అన్నారు మంచు విష్ణు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘జిన్నా’. ఈశాన్ సూర్య హెల్మ్ దర్శకుడు. పాయల్రాజ్పుత్, సన్నీ లియోన్ కథానాయికలు. అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో మంచు విష్ణు మాట్లాడుతూ ‘జూబ్లీహిల్స్లో ఉన్న రెండు ఐపీ అడ్రస్ల నుంచి ట్రోల్స్ వస్తున్నాయని తెలిసింది. అందులో ఓ హీరో ఆఫీసు కూడా ఉంది. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మీమ్స్ సర్క్యులేట్ చేస్తున్నారు.
నా మీద అంత డబ్బులు పెట్టి ట్రోల్ చేయడం చూస్తుంటే కామెడీగా అనిపిస్తున్నది. వాళ్లు ఏం ఆశించి అలా చేస్తున్నారో నాకు కూడా తెలియదు. కోర్టులో అన్ని విషయాలు బయటకొస్తాయి. ‘మా’ ఎలక్షన్స్ నుంచే ఇవన్నీ మొదలయ్యాయి. అంతకు ముందు నా మీద ఇలాంటి ట్రోల్స్ లేవు. దీన్ని బట్టి ఇదొక పెయిడ్ క్యాంపెయిన్ అని అర్థమవుతున్నది. దీన్ని ఎవరూ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారని కేసులు వేశాం’ అని చెప్పారు. ‘జిన్నా’ సినిమా కామెడీ ఎంటర్టైనర్గా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని, అక్టోబర్ 5న ట్రైలర్ను విడుదల చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు ఈశాన్ సూర్య, జి.నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు.