Yelpula Pochanna | తన కళతో దేశవ్యాప్తంగా రంగులు పూయిస్తున్నాడు మంచిర్యాల జిల్లా చెన్నూరుకు చెందిన ఏల్పుల పోచన్న. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్పై కళాయాత్ర సాగిస్తూ.. మార్గమధ్యంలోని మజిలీలను క్యాన్వాస్పై చిత్రిస్తున్నాడు. ఇప్పటికే ఇరవై రాష్ట్రాల్లో సవారీ పూర్తిచేసి వందలాది చిత్తరువులు గీశాడు.
పోచన్నది నిరుపేద కుటుంబం. ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాడు. డిగ్రీ తర్వాత బ్యాచ్లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చదివాడు. ఆపైన మాస్టర్స్ పట్టా అందుకున్నాడు. ఆ అర్హతతో ఓ కార్పొరేట్ పాఠశాలలో డ్రాయింగ్ టీచర్గా చేరాడు. కొన్నాళ్లకు ‘జీతమే జీవితం కాదు, ఏదో సాధించాలి’ అనుకున్నాడు. అంతే, ‘కశ్మీర్ టు కన్యాకుమారి’ సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టాడు. పనిలో పనిగా, తన కళ ద్వారా భారతీయ సంస్కృతిని ప్రజలకు చాటాలని సంకల్పించాడు. వివిధ ప్రాంతాల సంప్రదాయాలు, వస్త్రధారణ, పండుగల నేపథ్యాన్ని, ఆచారాలను ‘లైవ్ డ్రాయింగ్’ చేస్తున్నాడు. వాటిని స్థానికులకే బహుమతిగా ఇస్తున్నాడు. ఇప్పటికే 20 రాష్ట్రాలులు పర్యటించాడు.
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్ పాఠశాలలో బస చేస్తున్నాడు. కన్యాకుమారితో తన కళాయాత్రను ముగించనున్నట్టు చెబుతున్నాడు పోచన్న. ఈ పర్యటనలో తను గీసిన చిత్రాలతోపాటు, అనుభవాలను పుస్తక రూపంలో ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులకు అందుబాటులో తేవాలన్నది అతని సంకల్పం. ‘ఈ యాత్రలో ఒక పూట తిండి దొరికితే, మరోపూట పస్తులున్న సందర్భాలు ఎన్నో! అమ్మా నాన్నలకు ఫోన్ చేసినప్పుడు కండ్లల్లో నీళ్లు తిరిగేవి. లైవ్ డ్రాయింగ్ గురించి కూడా జనంలో అవగాహన కల్పించాలన్నది నా తపన. గురువులు, స్నేహితుల సహకారంతో యాత్రను కొనసాగిస్తున్నా’ అంటాడు పోచన్న. ఈ కళా యాత్రికుడి కల నెరవేరాలని మనమూ కోరుకుందాం.
…✍ కొమ్మెర రామమూర్తి
“అమ్మాయిల తనువులపైనే అద్భుతమైన చిత్రాలు.. హైదరాబాదీ కళాకారిణి ఎందుకిలా చేస్తుంది?”