పెంచికల్పేట్, మార్చి 31: కరోనా వైరస్ మళ్లీ వ్యాపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో మాస్కు ధరించని వారికి రూ.1000 జరిమానా విధించాలని పంచాయతీ కార్యదర్శులకు తహసీల్దార్ అనంతరాజు సూచించారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండలాధికారులు, పంచాయతీ కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండో దశ కరోనా విస్తరిస్తుండడంతో జాగ్రత్తలపై గ్రామాల్లో డప్పు చాటింపు వేయాలని కార్యదర్శులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎస్ఐ రమేశ్, ఎంపీవో గంగాసింగ్, డిప్యూటీ తహసీల్దార్ రఘునాథ్రావు, ఏపీవో సతీశ్, కార్యదర్శులు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
రెబ్బెన, మార్చి31: సెకండ్ వేవ్ రూపంలో తిరిగి విజృంభిస్తున్న కరోనా వైరస్పై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని రెబ్బెన సీఐ సతీశ్కుమార్ సూచించారు. రెబ్బెన పోలీస్స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా మాస్కు ధరించాలన్నారు. భౌతిక దూరం పాటించాలని సూచించారు. మాస్కులు ధరించని వారిపై జీవో నంబర్ 68ప్రకారం కేసులు నమోదు చేసి, కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. సమావేశంలో రెబ్బెన ఎస్ఐ భవానీసేన్ ఉన్నారు.
కరోనా నిబంధనలు పాటించాలి
తిర్యాణి, మార్చి31: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటించాలని రెబ్బన సీఐ సతీశ్ కుమార్ సూచించారు. బుధవారం పోలీసు స్టేషన్ను ఆయన సందర్శించి, రికార్డులు, నూతనంగా నిర్మితమవుతున్న క్వాటర్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, పోలీసుల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. తిర్యాణి, రెబ్బెన ఎస్ఐలు రామారావు, భవానీగౌడ్,సిబ్బంది ఉన్నారు.