రూ. 1.91 కోట్లు లూటీ చేసిన సంస్థ మేనేజర్లపై కేసు
సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : ఫైనాన్స్ సంస్థలో నమ్మకంగా పనిచేస్తూ ఆ సంస్థకే రూ.1.99 కోట్లు టోకరా వేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్లో ఎస్ఆర్ఈఐ ఇక్విప్మెంట్ ఫైనాన్స్ లిమిటెడ్(ఎస్ఈఎఫ్ఎల్) నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ కార్యాలయం ఉంది. ఈ సంస్థ వివిధ వ్యాపారాలకు, వాహనాలకు, నిర్మాణాలకు సంబంధించిన రుణాలు జారీ చేస్తుంది. రుణాలు పొందిన వారు ప్రతి నెల ఈఎంఐలు నగదు, చెక్కులు, ఆన్లైన్ పేమెంట్స్ తదితర మార్గాల ద్వారా చెల్లిస్తుంటారు. ఈ చెల్లింపుల్లో కొన్ని సందర్భాల్లో వివరాలు ఉండకపోవడంతో ఏ కస్టమర్ పంపించాడు.. అనే విషయంలో సందేహాలుంటాయి. వీటిని ఆయా కస్టమర్లకు ఫోన్లు చేసి నిర్ధారించుకున్న తరువాత ఆయా ఖాతాల్లో జమ చేస్తుంటారు.
స్పష్టత వచ్చే వరకు ఆ మొత్తాలను సస్పెన్స్ అకౌంట్లో జమచేస్తుంటారు. ఈ ఖాతాలను ప్రతి సంవత్సరం తనిఖీలు చేసి, ఆయా ఖాతాల లెక్కలు పరిశీలిస్తుంటారు. ఈ క్రమంలోనే 2021-22కు సంబంధించిన లెక్కలు పరిశీలిస్తుండగా యజమాన్యానికి లెక్కల్లో లోపాలు కన్పించాయి. ఆ లోపాలపై ఆరా తీయగా అందులో పనిచేసే కొందరు మేనేజర్లు కస్టమర్ల వద్ద నుంచి వచ్చిన డబ్బును తమ సొంతాని వాడుకున్నారు. ఆ తరువాత ఆయా కస్టమర్లకు ఎన్ఓసీలు కూడా జారీ చేసినట్లు వెల్లడైంది. ఇలా రూ. 1,99,18,189 కంపెనీకి నష్టం జరిగినట్లు నిర్ధారించారు. సస్పెన్స్ ఖాతా నుంచి రూ.5.51 లక్షలు సొంతానికి వాడుకున్నట్లు తేలింది. పథకం ప్రకారం కంపెనీ డబ్బులు వాడుకొని మోసం చేసిన మేనేజర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సంస్థ జోనల్ లీగల్ మేనేజర్ చంద్రశేఖర్రావు సీసీఎస్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.