మంచిర్యాల (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 30 : రాష్ట్రంలోని 26 వేల ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసుకునేందుకు సీఎం కేసీఆర్ రూ.7 వేల కోట్లతో మన ఊరు-మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకంలో మంచిర్యాల జిల్లాలోని 710 ప్రభుత్వ పాఠశాలలకుగాను 245 పాఠశాలలను తొలి విడుత కింద ఎంపిక చేశారు. వీటి కోసం దాదాపు రూ.109 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, టాయిటెట్లు, ప్రహరీలు, తాగునీటి వసతుల కల్పనతో పాటు విద్యుత్, ఫర్నిచర్, పెయింటింగ్, బ్లాక్ బోర్డులు, కిచెన్ షెడ్లు, తరగతి గదులకు మరమ్మతులు, డైనింగ్హాల్స్, డిజిటల్ విద్యకు సంబంధించిన పనులు చేపడుతున్నారు. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తి కాగా, మిగిలిన పనులు ఈ దసరా సెలవుల్లోగా పూర్తి చేస్తామని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.
23 పాఠశాలల్లో రూ.50 లక్షల పనులు
మంజూరైన నిధులతో 245 పాఠశాలల అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదికలను అధికారులు సిద్ధం చేశారు. ఇందు లో 190 పాఠశాలల్లో పనులను ఇప్పటికే ప్రారంభించారు. ఇక 23 పాఠశాలలు టెండర్ల దశలో ఉన్నాయి. మరో 32 బడులకు సంబంధించిన టెండర్లు పూర్తయ్యాయి. ఇక్కడ పనులు మొ దలు పెట్టాల్సి ఉంది. పనులు ప్రారంభించిన 190 పాఠశాలల్లో 8 పాఠశాలల్లో రూ.30 లక్షలకు మించిన పనులు సాగుతుండ డం గమనార్హం. మిగిలిన 55 పాఠశాలల్లో 23 పాఠశాలలు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్యలో పనులు చే యాల్సి ఉంది. అందుకే ఈ బడులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఆలస్యమవుతున్నట్లు అధికారులు తెలిపారు.
శరవేగంగా పనులు..
ఎంపికైన పాఠశాలల్లో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. 18 మండలాల్లో దాదాపు 80 శాతానికిపైగా పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇటీవలే మండలానికి రెండు బడుల చొప్పున ర్యాండమ్గా పనులను పరిశీలించిన ఉన్నతాధికారులు కలెక్టర్కు దీనిపై సమగ్ర నివేదికను సమర్పించారు. లక్సెట్టిపేటలో 80శాతం, మంచిర్యాలలో 85శాతం, నస్పూర్లో 80శాతం, చెన్నూర్లో 90, హజీపూర్, కొత్తపల్లి, కాసిపేట, బెల్లంపల్లి, జన్నారం, దండేపల్లి, నెన్నెల 100శాతం, భీమినిలో ఎలక్ట్రికల్ వర్క్లు తప్ప మిగిలిన పనులన్నీ పూర్తయ్యాయి. కన్నెపెల్లిలో 70 శాతం పనులు అయిపోయాయి. మందమర్రి, జైపూర్లో 90, తాండూరు 75 శాతం పనులు పూర్తయ్యాయి.
‘మన ఊరు-మన బడి’లో చేయాల్సిన పనుల వివరాలు ఇలా..
దసరా సెలవుల్లోగా పూర్తి చేస్తాం
ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులను వేగవంతం చేశాం. ఇప్పటికే 80 శాతానికిపైగా పూర్తయ్యాయి. మిగిలిన పనులను దసరా నాటికి పూర్తి చేస్తాం. ఈ విషయంపై ఇంజినీర్లతో సమావేశం సైతం నిర్వహించాం. ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు, ఎస్ఎంసీల చైర్మన్లు పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. పనుల్లో నాణ్యత లోపించకుండా చర్యలు తీసుకుంటున్నాం. కార్పొరేట్ స్థాయిలో వసతులతో పాటు విద్య అందించేందుకు కృషి చేస్తున్నాం.
– వెంకటేశ్వర్లు, డీఈవో, మంచిర్యాల