హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిలో అంబులెన్స్ చోరీకి గురైంది. అంబులెన్స్ను చోరీ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం కరీంనగర్ నుంచి ఓ రోగిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి అంబులెన్స్లో తీసుకొచ్చారు. అయితే అంబులెన్స్కే తాళాలను ఉంచి, డ్రైవర్ రోగిని తీసుకొని ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లాడు. ఇక అంబులెన్స్కు తాళాలు ఉన్న విషయాన్ని ఓ వ్యక్తి గమనించాడు. క్షణాల్లోనే అంబులెన్స్ను తీసుకొని పారిపోయాడు.
అంబులెన్స్ డ్రైవర్ ఎల్ శ్రీనివాస్ చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అంబులెన్స్ ఆచూకీ కోసం గాలించారు. అంబులెన్స్ను దొంగిలించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని సికింద్రాబాద్ న్యూబోయిగూడకు చెందిన కే యాదగిరి(33)గా పోలీసులు గుర్తించారు. ఇతనిపై ఇప్పటికే మూడు దొంగతనం కేసులు గాంధీనగర్ పీఎస్లో నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి నుంచి అంబులెన్స్ను స్వాధీనం చేసుకున్నారు.