ముంబై: భార్య ఆధార్ కార్డు గుర్తింపుతో ప్రియురాలితో కలిసి ఒక వ్యక్తి హోటల్లో గడిపాడు. భర్తపై అనుమానించిన భార్య అసలు విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహారాష్ట్రలోని పూణేలో ఈ ఘటన జరిగింది. గుజరాత్కు చెందిన 41 ఏండ్ల వ్యక్తి వ్యాపారవేత్త. ఆయన భార్య ఒక కంపెనీలో డైరెక్టర్గా పని చేస్తున్నది. అయితే, భర్త తనను మోసగిస్తున్నట్లు అనుమానించిన భార్య, అతడి కారులో జీపీఎస్ పరికరాన్ని ఏర్పాటు చేసింది. గత ఏడాది నవంబర్లో బిజినెస్ పనిమీద బెంగళూరు వెళ్తున్నట్లు ఆ వ్యక్తి తన భార్యకు చెప్పాడు. అయితే అతడు తన ప్రియురాలితో కలిసి పూణేలోని ఒక హోటల్లో గడిపాడు. ప్రియురాలి కోసం భార్య ఆధార్ కార్డు నంబర్ను వినియోగించాడు.
మరోవైపు భర్త కారులోని జీపీఎస్ పరికరం ద్వారా అతడు బెంగళూరు వెళ్లలేదని భార్య తెలుసుకున్నది. టూర్ కాలంలో పూణెలో ఒక హోటల్ వద్ద భర్త కారు ఉన్నట్లు గ్రహించింది. దీంతో ఆ హోటల్కు వెళ్లి ఆరా తీసింది. తన భర్త మరో మహిళను భార్యగా పేర్కొని హోటల్లో బస చేసినట్లు సిబ్బంది ఆమెకు తెలిపారు. ఆ మహిళ కోసం తన ఆధార్ గుర్తింపు నంబర్ను వినియోగించినట్లు భార్య తెలుసుకున్నది. అలాగే అక్కడి సీసీటీవీ ఫుటేజ్ను కూడా ఆమె పరిశీలిచింది.
ఈ ఆధారాలతో తన భర్తతోపాటు అతడి ప్రియురాలిపై పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో ఆధారాలను పరిశీలించిన హింజేవాడి పోలీసులు భర్తతోపాటు అతడి ప్రియురాలిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారిద్దరూ పరారీలో ఉన్నట్లు తెలిపారు.