హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): ఇటీవల తిరుపతిలోని రుయా దవాఖానలో జరిగిన ఘటనను జనం మరిచిపోకముందే తాజాగా తిరుపతి జిల్లాలో మరో అమానవీయ ఘటన జరిగింది. తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కొత్తపల్లికి చెందిన చిన్నారి అక్షయ (2) గురువారం ప్రమాదవశాత్తు గ్రావెల్ గుంతలో పడి నీట మునిగింది. ఆ బాలికను గుంత నుంచి తీసి నాయుడుపేట ప్రభుత్వ దవాఖానకు తరలించేలోగానే చనిపోయింది.
అనంతరం అక్షయ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు 108 వాహన సిబ్బంది, ఆటో డ్రైవర్లు నిరాకరించారు. దీంతో ఆ చిన్నారి మృతదేహాన్ని స్వయంగా తండ్రే తన బైక్పై స్వగ్రామానికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ దృశ్యాలు నెట్టింట్లో వైరల్గా మారాయి. ఇటీవల తిరుపతి రుయాలో ఓ బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆ దవాఖానలోని అంబులెన్స్ డ్రైవర్లు రూ.10 వేలు డిమాండ్ చేయడం, స్వగ్రామం నుంచి వేరే అంబులెన్స్ను రప్పించినా.. దాన్నీ అనుమతించకపోవడం చర్చనీయాంశమైంది. తాజాగా నాయుడుపేటలో జరిగిన ఘటనతో అంబులెన్స్ యజమానుల ఆగడాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.