(Man suicide) అనంతపురం: ఇద్దర్ని పెండ్లాడి.. వారిని పోషించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం పట్టణంలో చోటు చేసుకున్నది. మృతుడు సాకే నాగేంద్ర అనంతపురం పట్టణంలోని నవోదయ కాలనీలో నివసిస్తూ.. ఓ డ్రిప్ కంపెనీలో జిల్లా కో ఆర్డినేటర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈయనకు భార్య, కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు భార్యలను పోషించే స్థోమత లేక దిగాలు పడిపోయి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మూడేండ్ల క్రితం బదిలీపై చిత్తూరుకు వెళ్లిన సమయంలో అక్కడ దుర్గా భవాని అనే మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం సహజీవనానికి దారితీసింది. కొన్ని నెలల తర్వా అనంతపురానికి తిరిగి వచ్చిన నాగేంద్ర.. మరికొన్నాళ్లకు దుర్గా భవానిని అనంతపురం తీసుకొచ్చి హౌసింగ్ బోర్డు కాలనీలో కాపురం పెట్టాడు. ఆదివారం దుర్గా భవానీ ఇంటికి వచ్చిన నాగేంద్ర.. బెడ్ రూంలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఎంతసేపటికి బయటకు రాకపోవటంతో దుర్గాభవాని.. ఇంటికి సమీపంలో ఉండే నాగేంద్ర స్నేహితుడికి ఫోన్ ద్వారా సమాచారం అందించింది. వెంటనే అతను రెండో పట్టణ పోలీసులకు చెప్పాడు. దుర్గాభవానీ ఇంటికి వచ్చిన పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా.. అప్పటికే నాగేంద్ర ఫ్యాన్కు ఉరేసుకుని మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని రెండో పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రెండు కుటుంబాలను పోషించడం భారంగా మారినందునే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చునని, విచారణలో అసలు విషయాలు తేలుతాయని పోలీసులు చెప్పారు.