జైపూర్ : రోగి గాయత్రి మంత్రం జపిస్తుండగా వైద్యులు అరుదైన బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ నిర్వహించిన ఉదంతం జైపూర్లోని నారాయణ హాస్పిటల్లో వెలుగుచూసింది. సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ కేకే బన్సల్ నేతృత్వంలో న్యూరో సర్జరీ టీం విజయవంతంగా ఈ ఆపరేషన్ నిర్వహించింది. చురు ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ హవల్ధార్ రిధ్మల్ రామ్ (57) మాట్లాడలేక పోతుండటంతో పరీక్షించిన వైద్యులు బ్రెయిన్లోని స్పీచ్ ఏరియాలో లోగ్రేడ్ బ్రెయిన్ ట్యూమర్ను గుర్తించారు.
సున్నితమైన ఈ ప్రాంతంలో ట్యూమర్ను తొలగించే క్రమంలో మాట్లాడే శక్తి కోల్పోవడంతో పాటు పక్షవాతం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో రోగిపై సీనియర్ న్యూరోసర్జన్ డాక్టర్ కేకే బన్సల్ నేతృత్వంలోని న్యూరో సర్జన్ల బృందం విజయవంతంగా ఎవేక్ బ్రెయిన్ న్యూరో సర్జరీని నిర్వహించిందని నారాయణ హాస్పిటల్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ మాలా ఐరున్ తెలిపారు. ఇక సర్జీరీ ముగిసేవరకూ స్ప్రహలో ఉన్న రిధ్మల్ రామ్ వైద్యులు ఆపరేషన్ నిర్వహిస్తుండగా గాయత్రి మంత్రం జపించారు.