స్కూళ్లకు వెళ్లే పిల్లలకు ముందుగా బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపించాలని ప్రతి తల్లి ఆరాటపడుతుంది. అలా అనుకోవడమే ఒక మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. ఆమె ఒక్కతే కాదు, దీని వల్ల ఆమె ముగ్గురు కుమార్తెలు, అత్త కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో వెలుగు చూసింది.
స్థానికంగా నివశించే మహేష్ తివారీ (47)కి పూజలు పునస్కారాలంటే మక్కువ ఎక్కువ. ఉద్యోగం సద్యోగం లేకపోయినా వీటిపై ఎక్కవ టైం గడిపేస్తుంటాడు. అతని తల్లి బీతన్ దేవి (75) మానసిక ఆరోగ్యం సరిగా లేదు. అతని అన్న ఉమేష్ అమెరికా నుంచి పంపే డబ్బులతో కుటుంబం నడుస్తోంది. సోమవారం నాడు పిల్లలను స్కూల్కు పంపే ముందు బ్రేక్ఫాస్ట్ చేయడానికి మహేష్ భార్య నీతూ దేవి (36) వంటగదిలోకి వెళ్లింది. గ్యాస్ లేకపోవడంతో సిలిండర్ మార్చడానికి భర్తను పిలిచింది.
అతను పూజలో ఉన్నాడు. పిల్లలను స్కూల్కు పంపాలని, ముందు గ్యాస్ సిలిండర్ మార్చాలని ఆమె గట్టిగా పిలిచింది. అతను వచ్చి చూస్తే రెండో గ్యాస్ సిలిండర్ కూడా ఖాళీగా ఉంది. దీంతో తన భర్తే ఉద్యోగం చేస్తుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదా? అంటూ ఆమె బాధ పడింది. ఈ విషయంలో భార్యాభర్తలకు గొడవ జరిగింది. దాంతో పక్కనే ఉన్న కత్తి తీసుకొని భార్య గొంతు కోసేశాడు మహేష్.
ఆ వెంటనే దివ్యాంగురాలైన రెండో కుమార్తె స్వర్ణ (11)ను కూడా చంపేశాడు. ఆ తర్వాత అపర్ణ (13), అన్నపూర్ణ (9)ను కూడా కిరాతకంగా చంపేశాడు. తల్లి బీతన్ను కూడా హతమార్చి ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసేసుకున్నాడు. ఆ ఇంటి నుంచి అరుపులు వినిపించడంతో వచ్చి చూసిన పొరుగింటి వాళ్లకు.. లోపల గది నిండా రక్తం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వాళ్లు రంగంలోకి దిగారు. మృతదేహాలు పోస్టుమార్టానికి పంపించి, మహేష్ను అదుపులోకి తీసుకున్నారు.