వరంగల్: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో ప్రియురాలి కొడుకును గొంతు నులిమి చంపిన వ్యక్తికి యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ జిల్లా అదనపు న్యాయమూర్తి కే శైలజ తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి శ్రీనివాసరావు కథనం ప్రకారం నిందితుడు ఒరిస్సాకు చెందిన దినసరి కూలీ సమీపంలోని నక్కలపల్లి ఇటుక బట్టీల్లో పనిచేస్తూ ఉండేవాడు. తన పొరుగు గ్రామానికి చెందిన సంజు అనే వివాహితతో అతనికి అక్రమ సంబంధం ఉండేది. ఒరిస్సా నుంచి సంజు కుటుంబాన్ని నక్కలపల్లి పిలిపించాడు. తాను పనిచేసే ఇటుక బట్టీలోనే పనికి కుదిర్చాడు.
అక్రమ సంబంధాన్ని సంజు 11 ఏండ్ల కొడుకు పసిగట్టడంతో తమ అక్రమ సంబంధం బాహ్య ప్రపంచానికి తెలియకూడదనే ఉద్దేశంతో నిందితుడు ఆ బాలున్ని గతేడాది జనవరి 12న ముళ్ళ పొదల్లోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి నిందితుడు పారిపోయాడు. మరుసటి రోజు విగతజీవిగా ఉన్న బాలుడు దినేశ్ మృతదేహాన్ని కనుగొని ఫిర్యాదు చేయడంతో మామూనూరు పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. అప్పటి ఇన్స్పెక్టర్ ఎస్.రాజు ఈ కేసులో నిందితున్ని అదుపులోకి తీసుకొని సాక్షాధారాలు సేకరించి చార్జిషీటు దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన రెండో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కే శైలజ నిందితుడు నేరం చేశాడని నిర్ధారించి హత్యానేరం కింద యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో కోర్ట్ డ్యూటీ కానిస్టేబుల్ ఎం.చందర్ సాక్షులను ప్రవేశపెట్టినట్లు ఇన్స్పెక్టర్తెలిపారు.