అమరావతి ,జూలై : లారీ టైర్ పేలడంతో వ్యక్తి మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా వేపాడ మండలంలోని బొద్దాం గ్రామంలో చోటు చేసుకుంది. గార మండలంలోని శాలిహుండం కొత్తపేటకు చెందిన పందిరి దేవా అనే వ్యక్తి రెండేళ్ల క్రితం సొంతగా టైర్ల దుకాణం పెట్టుకున్నాడు. బుధవారం లారీ టైరుకు గాలి పెడుతుండగా అది ఒక్కసారిగా ముఖానికి తగలడంతో అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు.
రక్తపుమడుగులో ఉన్న ఆయనను స్థానికులు ఎస్.కోట సీహెచ్సీకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తానని చెప్పిన భర్త శాశ్వతంగా దూరమయ్యాడంటూ భార్య రమణమ్మ గుండెలు అవిసేలా రోధిస్తున్నది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.