ఇటిక్యాల, సెప్టెంబర్ 12 : కృష్ణానదిలో స్నానం చేసే క్రమంలో యువకుడు గల్లంతైన ఘటన సోమవారం బీచుపల్లి పుష్కరఘాట్ వద్ద చోటు చేసుకున్నది. ఎస్సై గోకారి కథనం మేరకు.. హైదరాబాద్ హబ్సిగూడ ప్రాంతానికి చెందిన కొందరు వినాయక నిమజ్జనంలో భాగంగా సోమవారం తెల్లవారుజామున బీచుపల్లి క్షేత్రానికి వచ్చారు.
నిమజ్జనం తరువాత రద్దీ తక్కువగా ఉండే ఘాట్ వైపు వెళ్లి స్నానాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణ యాదవ్ (17) నది ప్రవాహం ఎక్కువగా ఉన్న వైపు వెళ్లగా నీటిలో కొట్టుకుపోయాడు. ఈ విషయాన్ని జాలర్లకు చెప్పగా.. వారు గాలింపు చర్యలు చేపట్టి యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు. కాగా, మృతుడు హైదరాబాద్లో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.