హైదరాబాద్ : నగరంలోని వనస్థలిపురంలో దారుణం జరిగింది. ప్రేయసి మోసం చేసిందన్న మనోవేదనలో ఫ్యాన్కు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వనస్థలిపురం వీఎంఆర్ గ్రాండ్ లాడ్జీలో ఇవాళ సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతుడిని ప్రకాశం జిల్లాకు చెందిన బ్రహ్మంగా పోలీసులు గుర్తించారు. ఈ ఉదయం బ్రహ్మం వీఎంఆర్ గ్రాండ్ లాడ్జీలో గది అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది.
ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ అతడు సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. తల్లి, భార్య తనను క్షమించాలంటూ వేడుకున్నాడు. ప్రియురాలు, స్నేహితులు తనను దారుణంగా మోసగించారని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టు నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.