దేశంలోని ప్రతి పేద వ్యక్తికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలన్న ఉద్దేశంలో జీరో బ్యాలెన్స్తో ప్రధాని నరేంద్ర మోదీ.. జన్ధన్ ఖాతా అనే ప్రోగ్రామ్ను ప్రారంభించారు. దీంతో చాలామంది జీరో అకౌంట్ను తీసుకున్నారు. తాజాగా ఆ జన్ధన్ ఖాతాలో ఓ రైతుకు లేనిపోని తలనొప్పులు తీసుకొచ్చింది. తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. పదండి.. ఓసారి అలా మహారాష్ట్రకు వెళ్లొద్దాం.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా పైతాన్ తాలుకాకు చెందిన జ్ఞానేశ్వర్ ఓటే గురించే మనం మాట్లాడుకునేది. గత సంవత్సరం ఆగస్టులో జ్ఞానేశ్వర్ జన్ధన్ ఖాతాలో 15 లక్షల రూపాయలు జమ అయ్యాయి. దీంతో జ్ఞానేశ్వర్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అది జన్ధన్ ఖాతా కావడంతో ఆ డబ్బులను ప్రధాని మోదీనే తనకు పంపించాడని జ్ఞానేశ్వర్ భావించాడు. దీంతో వెంటనే మోదీకి కృతజ్ఞతలు చెబుతూ ఓ మెయిల్ కూడా పంపించాడు జ్ఞానేశ్వర్.
అందులో నుంచి 9 లక్షలు విత్డ్రా చేసి సొంతిల్లు నిర్మించుకున్నాడు. అంతా బాగానే ఉంది. తన లైఫ్ సెట్ అయిపోయింది అనుకున్నాడు. ఇల్లు కట్టడం కోసం 9 లక్షలు ఖర్చు కాగా.. అకౌంట్లో 6 లక్షలు ఉన్నాయి. వాటితో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటాడు జ్ఞానేశ్వర్.
6 నెలలు అంతా హ్యాపీ. ఆ తర్వాత మనోడికి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. 6 నెలల తర్వాత బ్యాంక్ నాలుక కరుచుకుంది. ఎందుకంటే.. పొరపాటున జ్ఞానేశ్వర్ అకౌంట్లో 15 లక్షలు జమ అయ్యాయి. వాటిని మోదీ పంపించలేదు.. ఇంకెవరూ పంపించలేదు.
పింపల్వాడీ అనే గ్రామ పంచాయతీకి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆ డబ్బులను గ్రామ పంచాయతీ అకౌంట్లోకి పంపించబోయిన బ్యాంక్.. పొరపాటును జ్ఞానేశ్వర్ ఖాతాలో జమ చేసింది. ఈ విషయం తెలుసుకొని వెంటనే జ్ఞానేశ్వర్కు బ్యాంక్ లెటర్ పంపించింది. వెంటనే 15 లక్షలను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేసింది. కానీ.. అప్పటికే జ్ఞానేశ్వర్ 9 లక్షలు ఖర్చు పెట్టగా.. తన ఖాతాలో ఉన్న 6 లక్షలను మాత్రం బ్యాంక్కు చెల్లించాడు. మిగితా 9 లక్షలు ఎలా చెల్లించాలా అని తలపట్టుకొని కూర్చున్నాడు.