రుద్రంగి : భూ తగాదాలు, పాత కక్షలతో ఓ వ్యక్తిని ట్రాక్టర్తో ఢీకొట్టి హత్య చేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకున్నది. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. నేవూరి నర్సయ్య (42) అదే గ్రామానికి చెందిన నేవూరి కిషన్కు గత కొద్ది రోజులుగా భూ తగాదాలు జరుగుతున్నాయి. ఇదే విషయంలో నేవూరి కిషన్పై గతంలో నేపూరి నర్సయ్య దాడి చేయగా.. పోలీస్ కేసు నమోదైంది. ఈ క్రమంలోనే గురువారం ఉదయం 11 గంటల సమయంలో సబ్స్టేషన్ వద్ద పల్లెకు వెళ్లే దారిలో ద్విచక్రవాహనంపై వస్తున్న నర్సయ్యను.. కిషన్ తన ట్రాక్టర్తో ఢీకొట్టి హత్య చేశాడు.
ఆ తర్వాత రుద్రంగి పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. కిషన్ పోలీస్స్టేషన్లో ఉన్నాడని సమాచారం అందుకున్న నర్సయ్య కుటుంబ సభ్యులు.. మృతదేహంతో పోలీస్స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై భైఠాయించారు. ఒక దశలో ఠాణాలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. నేవూరి కిషన్ పథకం ప్రకారమే.. నర్సయ్యను హత్య చేశాడని, దీనికి గ్రామంలోని ఓ బీజేపీ నాయకుడు మద్దుతు ఇచ్చాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.
గతంలో నేవూరి కిషన్తో ప్రాణహాని ఉందని నర్సయ్య చందుర్తి సీఐ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేపట్టడంతో సమాచారం అందుకున్న ఎస్పీ రాహుల్ హెగ్డే సంఘటనా స్థలానికి చేరుకొని న్యాయం చేస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. అప్పటికీ బాధిత కుటుంబం వినకపోవడంతో బంధువులు, గ్రామస్తులపై ఎస్పీ ఆదేశాల మేరకు లాఠీలను ఝుళిపించారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు.
నర్సయ్యను కిషన్ తన ట్రాక్టర్తో ఢీకొట్టి హత్య చేశాడని, అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు కొంతమందిపై అనుమానం వ్యక్తం చేశారని, వారి ప్రమేయంపై సమగ్ర విచారణ చేపట్టి, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆందోళన నేపథ్యంలో అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు నాగేంద్రచారి, చంద్రశేఖర్, సీఐలు మొగిలి, వెంకటేశ్, బన్సీలాల్, శ్రీలత, అనిల్కుమార్, ఉపేందర్, ఎస్ఐతో పాటు సూమారు 100 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.