కోల్కతా : మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ గాంధారి మాదిరిగా తయారయ్యారని మాజీ ఎమ్మెల్యే, జగ్మోహన్ దాల్మియా కుమార్తె వైశాలీ దాల్మియా విమర్శించారు. ఇక్కడ జరుగుతున్న అరాచకాలను, ఆకృత్యాలను చూడలేని అంధురాలని, తన సొంత పార్టీ నేతలు చేస్తున్న ఆగడాలను అరికట్టలేకపోతున్నారని ఆమె దుయ్యబట్టారు. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న అన్యాయాలను తరిమికొట్టలేని ఈవిడ.. ఢిల్లీపై కన్నేస్తానని అనడం విడ్డూరంగా ఉన్నదన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఇముడలేకనే ఆ పార్టీని వీడాల్సి వచ్చిందని చెప్పారు.
ఆదివారం ఉదయం వైశాలీ ధాల్మియా ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ మమతను తీవ్రంగా దునుమాడారు. టీఎంసీని వీడి బీజేపీలో చేరిన వైశాలీ దాల్మియాకు.. బీజేపీ అధిష్ఠానం బాలి స్థానం నుంచి బరిలో నిలిపింది. ‘తృణమూల్ కాంగ్రెస్లో తాను చెప్పిందే వినాలనే మనస్తత్వం మమతా బెనర్జీది.. ఆమె, ఆమె మేనల్లుడి పెత్తనం నచ్చక చాలా మంది పార్టీని వీడారు. ఆటలు ముఖ్యమేకానీ, ప్రజలను అడ్డుగా పెట్టుకొని అభివృద్ధిని పక్కనపడేసి ఆడుకోవాలనుకోవడం మంచిది కాదు పశ్చిమ బెంగాల్లో చాలా మంది చాలా రకాల ఆటలు ఆడారు. ఇప్పుడిక ఆటలు సాగవు. ఇలా చేస్తే ప్రజలే ఆడుకుంటారు. తనపై దాడి జరిగిందని, కాలుకు తీవ్రంగా గాయమైందని ఎదుటివారిపై ఆరోపణలు చేయడం ఎన్నికల సమయంలో చాలా సాధారణం. మమతలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఆమె గాంధారి మాదిరిగా తయారయ్యారు. కమిషన్లు తీసుకోవడానికి, అవినీతికి కేరాఫ్గా మిగిలారు’ అని వైశాలీ దాల్మియా చెప్పారు.
పార్టీలో కొందరు చేస్తున్న తప్పిదాలపై గొంతు విప్పడం పార్టీ పెద్దలకు నచ్చలేదు, పార్టీలో చెదపురుగులు తయారయ్యారని అన్నందుకు తనను పార్టీ నుంచి బహిష్కరించారని, ఇదే నేను చేసిన తప్పిదమని ఆమె అన్నారు. సౌరవ్ గంగూలీ చాలా మంచి మనిషి అని, ఆయన బీజేపీలోకి వస్తే అంతకన్నా ఇంకేం కావాలని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ప్రపంచంలో శక్తివంతమైన మిలిటరీ ఏదో తెలుసా?