కోల్కతా: బెంగాల్ సీఎం మమత బెనర్జీ కేంద్రంపై మరోసారి తనదైన రీతిలో నిప్పులు చెరిగారు. బెంగాల్లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు. దేశాన్ని సర్వ నాశనం చేశారు. ఆరు మాసాలుగా కేంద్ర ప్రభుత్వం పని చేయలేదు. బెంగాల్ ను పట్టుకుంటామని రోజూ ఇక్కడికే చక్కర్లు కొట్టారు అని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆరు మాసాలు పనిచేయకపోవడం వల్లే దేశంలో కరోనా విలయ తాండవం చేస్తున్నదని అన్నారు. తృణమూల్ ఎమ్మెల్యే బిమాన్ బంధోపాధ్యాయ వరుసగా మూడోసారి బెంగాల్ శాసనసభ స్పీకర్ గా ఎన్నికైన సందర్భంగా ఆమె సభలో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవలేకపోయిన బీజేపీ హింసాకాండ రెచ్చగొడుతున్నదని అన్నారు. మతకల్లోలాన్ని రెచ్చగొట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సంఘం నేరుగా సాయం అందించకపోతే బీజేపీ కనీసం 30 సీట్లు కూడా గెలిచేది కాదని మమత ఆరోపించారు. మొన్నటి ఎన్నికల్లో కొన్నిచోట్ల ఎన్నకల సంఘం కనుసన్నల్లో రిగ్గింగ్ జరిగిందని ఆమె అన్నారు. ప్రజల తీర్పు అంగీకరించలేని బీజేపీ అల్లర్లకు తెగబడుతున్నదని అన్నారు.