కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ సారథ్యంలోని పాలక తృణమూల్ కాంగ్రెస్ సర్కార్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఐదుగురు సిట్టింగ్ తృణమూల్ ఎమ్మెల్యేలు సోమవారం బీజేపీలో చేరారు. ఎమ్మెల్యేలు సోనాలి గుహ, సీతల్ సర్దార్, దీపేందు బిశ్వాస్, రవీంద్రనాథ్ భట్టాచార్య, జతు లహిరిలు కాషాయ పార్టీలో చేరారు. తృణమూల్ ఎమ్మెల్యేలతో పాటు హబీబ్పూర్ నుంచి ఆ పార్టీ అభ్యర్థి సరళా ముర్ము కూడా బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.
పశ్చిమ బెంగాల్ పార్టీ చీఫ్ దిలీప్ ఘోష్, పార్టీ నేతలు సువేందు అధికారి, ముకుల్ రాయ్ల సమక్షంలో వీరంతా బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలువురు తృణమూల్ ఎమ్మెల్యేలు, ఎంపీ, పెద్ద సంఖ్యలో నేతలు కాషాయ పార్టీలో చేరడంతో బీజేపీ దీదీకి గట్టి పోటీ ఇచ్చే స్ధితికి ఎదిగింది. గతవారం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్ల సమక్షంలో మాజీ కేంద్ర రైల్వే మంత్రి, టీఎంసీ నేత దినేష్ త్రివేది బీజేపీలో చేరారు. ఇక 291 మంది సభ్యులున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 మధ్య ఎనిమిది విడతల్లో పోలింగ్ జరగనుంది.