కోల్కతా : పశ్చిమ బెంగాల్లో సీబీఐ, ఈడీ దాడుల కేసులు పెరుగుతుండటం పట్ల సీఎం మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. బెంగాల్లో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై విచారణ చేపడతామని ఆమె హెచ్చరించారు. టీఎంసీ విద్యార్ధి విభాగం సోమవారం చేపట్టిన ర్యాలీని ఉద్దేశించి దీదీ మాట్లాడారు.
సీబీఐ, ఈడీ సహా ఇతర కేంద్ర ప్రభుత్వ అధికారులపై ఇక్కడ కేసులున్నాయని, మా అధికారులను మీరు ఢిల్లీ పిలిస్తే తాను మీ అధికారులను పిలిపిస్తానని హెచ్చరించారు. రాష్ట్రంలో పనిచేస్తున్న దాదాపు ఎనిమిది మంది కేంద్ర ప్రభుత్వ అధికారులపై కేసులున్నాయని చెప్పారు.
కేంద్రం సీబీఐ ద్వారా తమ వారిని అరెస్ట్ చేస్తోందని, తాను ఈ విషయాలన్నింటినీ గమనంలోకి తీసుకుంటున్నానని అన్నారు. బిల్కిస్ బానో కేసులో దోషులను గుజరాత్ ప్రభుత్వం విడిచిపెట్టిన ఉదంతంలో ప్రమేయం ఉన్న వారిపై చర్యలు చేపట్టాలని కోరుతూ టీఎంసీ కోల్కతాలో 48 గంటల పాటు ధర్నాకు పిలుపిస్తోందని మమతా బెనర్జీ పేర్కొన్నారు.