బంకుర: సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే.. శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే.. ఓం జయంతీ మంగళా కాళీ భద్రకాళీ కపాలినీ.. దుర్గా శివా క్షమా ధాత్రీ స్వాహా స్వధా నమోస్తుతే అంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి చండీ స్తోత్రాన్ని వినిపించారు. ఇవాళ బంకురలో జరిగిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గామాత మంత్రాన్ని వల్లించారు. బెంగాలీలు దుర్గాదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే విషయం తెలిసిందే. అయితే బీజేపీ హిందుత్వ రాజకీయాలు చేస్తోందని, తాను కూడా హిందువునే అని.. ఇటీవల జరిగిన ఓ సభలో మమతా బెనర్జీ చండీ మంత్రాన్ని పఠించారు. ఆ మంత్రాన్ని చదివాకే ఇంట్లోంచి బయటకు అడుగుపెడుతానని చెప్పారు. ఇక ఆ తర్వాత నందీగ్రామ్లో నామినేషన్ వేశారు. ఆ సాయంత్రమే ఆమెపై దాడి జరిగింది. కోల్కతా ఆస్పత్రిలో కాలుకు పట్టీ వేయించుకున్న దీదీ.. మళ్లీ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. బంకుర సభలో మరోసారి మమతా బెనర్జీ ఆ మంత్రాన్ని ఇవాళ వినిపించారు.
సభలో ప్రసంగిస్తూ.. హోంశాఖ మంత్రి ఈ దేశాన్ని నడిపిస్తారా అని దీదీ ప్రశ్నించారు. ఏ ఏజెన్సీ ఎవర్ని వెంటాడుతుందో చెప్పాలంటూ ఆమె అడిగారు. ఎన్నికల సంఘాన్ని ఎవరు నడిపిస్తున్నారని ఆమె ప్రశ్నించారు. అమిత్ షా.. మీరు కాదనుకుంటా అని ఆమె అన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలని కోరుకుంటున్నట్లు దీదీ చప్పారు. ఎన్నికల సంఘం వ్యవహారాల్లో అమిత్ షా జోక్యం చేసుకుంటున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. మరోవైపు బెంగాల్లోని పురులియాలో ఇవాళ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. 2014 కన్నా ముందు దేశంలో ఓ భయం ఉండేదని, ఆలయాలకు వెళ్తే ఎక్కడ తమ సెక్యులర్ భావాలు దెబ్బతింటాయో అని భయపడేవారన్నారు. కానీ ఈ రోజుల్లో మమతా బెనర్జీ కూడా చండీ మంత్రాన్ని చదువుతున్నారని ఆదిత్యనాథ్ విమర్శించారు.