కోల్కతా: అధికారం కుటుంబం నిజ స్వరూపాన్ని గుర్తించలేకపోయిన ఓ పెద్ద గాడిదను నేను అని అన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కాంతి దక్షిణ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె అధికారి కుటుంబం లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కొన్నాళ్ల కిందట సువేందు అధికారి బీజేపీలో చేరగా.. తాజాగా ఆదివారం ఆయన తండ్రి, టీఎంసీ ఎంపీ శిశిర్ అధికారి కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. పూర్బ మేదినీపూర్ జిల్లాలో అధికారి కుటుంబం రూ.5 వేల కోట్ల సామ్రాజ్యాన్ని అక్రమంగా నిర్మించుకున్నారని, తాను మళ్లీ అధికారంలోకి వస్తే వాళ్లపై ఆస్తులపై విచారణ జరుపుతానని మమత స్పష్టం చేశారు. ఈ జిల్లాలో అధికారి కుటుంబానికి మంచి పట్టు ఉంది. ఇప్పుడీ కుటుంబంలో చాలా మంది బీజేపీలో చేరారు లేదంటే చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్లను గుర్తించలేకపోయిన పెద్ద గాడిదను నేను. నాకు తెలియదు కానీ వాళ్లు రూ.5 వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారట. ఆ డబ్బుతో వాళ్లు ఓట్లను కొంటారు. కానీ మీరు వాళ్లకు ఓట్లు వేయకండి అని మమత పిలుపునిచ్చారు.