Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాపన్న మల్లికార్జున్ ఖర్గే చరిత్ర సృష్టించారు. 24 ఏండ్ల తర్వాత జరిగిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన మల్లికార్జున్ ఖర్గే భారీ మెజార్టీతో గెలిచారు. ఇంగ్లీష్ భాషపై పాండిత్యానికి పేరు గాంచిన తన ప్రత్యర్థి శశిథరూర్ను మల్లికార్జున్ ఖర్గే చిత్తుగా ఓడించి, విజేతగా నిలిచారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపడుతున్న రెండో దళిత నేతగా ఖర్గే రికార్డుల్లోకి ఎక్కారు. కార్మిక నేత నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఖర్గే అంచెలంచెలుగా ఎదిగి కాంగ్రెస్ అధ్యక్ష పీఠంపై ఆశీనులు కాబోతున్నారు.
1942, జులై 21న కర్ణాటకలోని బీదర్లో జన్మించారు. మల్లికార్జున్ ఖర్గే గుల్బార్గాలోని సేఠ్ శంకర్లాల్ లహోటి కాలేజీలో న్యాయ విద్యను అభ్యసించారు. లాయర్గా తన జీవితాన్ని ప్రారంభించిన తర్వాత కార్మిక సంఘాల పక్షాన నిలబడి, వారి తరఫున కేసులను వాదించారు. చాలా కేసులను గెలిచారు. దీంతో ఖర్గేను లేబర్ యూనియన్ లీడర్గా ఎన్నుకున్నారు. 1969లో గుల్బర్గా సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక అక్కడ్నుంచి ఖర్గే రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు.
మల్లికార్జున్ ఖర్గే ఇప్పటి వరకు 12 సార్లు.. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఒక్కసారి మాత్రమే.. 2019లో ఓటమిని చవి చూశారు. 1972 నుంచి 2008 వరకు వరసుగా ఎనిమిది సార్లు కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఏడు సార్లు గుర్మిట్కల్ నియోజకవర్గం నుంచి గెలుపొందగా, 2008 ఎన్నికల్లో చిత్తాపూర్ నుంచి గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించారు. 2009, 2014 లోక్సభ ఎన్నికల్లో గుల్బార్గా నుంచి గెలుపొంది పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఖర్గే జీవితంలో ఇదే తొలి ఓటమి.
1976లో కర్ణాటక ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన 16 వేల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసి చరిత్ర సృష్టించారు. ఇక ఖర్గే హోంమంత్రి, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖల మంత్రిగా పని చేశారు. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత.. కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయడంతో, రాజ్యసభ పదవికి అక్టోబర్ 1న ఖర్గే రాజీనామా చేశారు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో రైల్వే శాఖ మంత్రిగా, కార్మిక, ఉపాధి కల్పన మంత్రిగా సేవలందించారు. 2014 నుంచి 2019 వరకు కాంగ్రెస్ లోక్సభా పక్ష నాయకుడిగా వ్యవహరించారు.