న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపించాలని పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తనను కోరారని పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. గాంధీ కుటుంబం నుంచి ఏ ఒక్కరూ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ఆసక్తి కనబరచకపోవడంతో అధ్యక్ష ఎన్నికల రేసులో నిలిచేందుకు అంగీకరించానని ఆయన వెల్లడించారు.
పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే మరో సీనియర్ నేత, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్తో పోటీ పడుతున్నారు. సోనియా గాంధీ తనను తన నివాసానికి పిలిపించి పార్టీ అధ్యక్ష పగ్గాలను చేపట్టాలని కోరారని, అయితే తాను మూడు పేర్లు ఇస్తానని ఆమెకు చెప్పగా నిరాకరించారని, తననే పార్టీకి నాయకత్వం వహించాలని కోరారని ఖర్గే చెప్పారు.
తనకు సమిష్టి నాయకత్వం, సంప్రదింపుల ప్రక్రియ పట్ల విశ్వాసం ఉందని, పార్టీ సభ్యులందరితో కలిసి కాంగ్రెస్ను సమున్నత శిఖరాలకు తీసుకువెళతానని స్పష్టం చేశారు. అసోంలో ఈశాన్య రాష్ట్రాల పార్టీ నేతలతో ఖర్గే సమావేశమై అధ్యక్ష ఎన్నికల్లో వారి మద్దతును కోరారు. అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు జరగనుండగా 19న ఫలితాలు వెల్లడిస్తారు.