కౌలాలంపూర్: కరోనా కట్టడిలో మొదటిది.. లక్షణాలున్నవారిని గుర్తించడం.. ఇది చాలా కష్టసాధ్యమైన పని. ఒకేసారి ఎంతోమందికి టెస్ట్లు చేయలేం. కొంతమంది లక్షణాలున్నా పరీక్షలు చేయించుకోరు. బహిరంగ ప్రదేశాల్లో అలాగే తిరిగేస్తుంటారు. ఇలాంటివారిని గుర్తించేందుకు మలేషియా పోలీసులు వినూత్న ప్రయోగం చేపట్టారు. బహిరంగ ప్రదేశాల్లో కరోనా లక్షణాలున్నవారిని గుర్తించేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. వీటి ద్వారా బాడీ టెంపరేచర్ అధికంగా ఉన్నవారిని గుర్తించి వారికి కొవిడ్ టెస్టులు చేస్తున్నారు.
డ్రోన్ ఎలా పనిచేస్తుంది..
ఈ డ్రోన్లు భూమినుంచి 20 మీటర్ల ఎత్తులో ఎగురుతాయి. మనుషుల శరీర ఉష్ణోగ్రతను గుర్తించే సామర్థ్యం ఈ డ్రోన్లకు ఉంది. బాడీ టెంపరేచర్ ఎక్కువ ఉన్న వ్యక్తి బహిరంగ ప్రదేశంలో తిరుగుతుంటే ఈ డ్రోన్ గుర్తించి అతడిపై రెడ్ లైట్ వేస్తుంది. అక్కడే ఉన్న పోలీసులు వచ్చి సదరు వ్యక్తిని కొవిడ్ టెస్టులకు పంపుతారు.
లాక్డౌన్ సడలింపు సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ సంఖ్యలో గుమిగూడుతున్నారని, అందులో ఎవరికి కరోనా ఉందో తెలియడం లేదని మలేషియా సర్కారు అంటోంది. లక్షణాలున్నవారిని గుర్తించి కరోనా ప్రబలకుండా చేసేందుకే ఈ ప్రయోగం చేపట్టామని చెబుతోంది. ఈ ప్రయోగం సానుకూల ఫలితాలను ఇస్తున్నదని అంటోంది. ఈ డ్రోన్ల పర్యవేక్షణకు ప్రత్యేకంగా 157 బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించింది.