తిరుమల : తిరుమలలో వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇవాళ మోహిని అవతారంలో మలయప్పస్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు . హైకోర్టు సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా స్వామివారి పల్లకిని మోసారు. రాత్రికి మలయప్పస్వామి గరుడ వాహనంపై ఊరేగనున్నారు. గరుడ సేవ సందర్భంగా నిన్నటి నుంచి తిరుమల కనుమదారుల్లో బైకులకు అనుమతిని నిరాకరించారు. రేపు మధ్యా హ్నం నుంచి ద్విచక్రవాహనాలకు అనుమతిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.
బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరు కుంటున్నారు. అన్నికంపార్టుమెంట్లు భక్తులతో నిండి అర కిలోమీటర్ మేర నిలిచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 14 గంటల సమయం పడుతుందని వెల్లడించారు. నిన్న శ్రీవారిని 75, 382 మంది భక్తులు దర్శించుకోగా 31,424 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 2.85 కోట్లు వచ్చిందని వివరించారు.
. బ్రహ్మోత్సవాల సందర్బంగా రాత్రి మహతి కళాక్షేత్రం లో నిర్వహించిన యక్షగాన ప్రదర్శనలు ప్రేక్షకులను రంజింపచేశాయి. దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యాన కర్ణాటక రాష్ట్రం కాసరఘడ్ నుంచి వచ్చిన శంకరనారాయణ యక్షగాన కళాసంఘ “ఏకాదశీవ్రత మహత్మ్యం” కనుమరుగైపోతున్న సంప్రదాయ జానపద నృత్యం “యక్ష గానం” ద్వారా అద్భుతంగా అభినయించారు.