malayalam remake | ప్రస్తుతం మలయాళ సినిమాల హవా నడుస్తోందనే చెప్పాలి. చిన్న కాన్సెప్ట్తో తీసిన ఈ సినిమాలు కేవలం మలయాళ ప్రేక్షకులనే కాదు..అందర్నీ మెప్పిస్తున్నాయి. అందుకే మనవాళ్లు మలయాళ సినిమాలను రీమేక్ చేయడంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి లూసిఫర్ రీమేక్ చేస్తుంటే.. పవన్ కళ్యాణ్, రానా అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీని రీమేక్ చేస్తున్నారు. అదికాకుండా రామ్చరణ్.. డ్రైవింగ్ లైసెన్స్ మూవీ రైట్స్ను తీసుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ ఏమో కప్పేలా రీమేక్ రైట్స్ను దక్కించుకుంది. ఇలా తెలుగులోకి వరుస పెట్టి సినిమాలు వస్తున్న తరుణంలో.. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కూడా ఒక మలయాళ సినిమా రైట్స్ను కొనుగోలు చేసింది. అదే ఇటీవల నెట్ఫ్లిక్స్లో రిలీజై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న నాయట్టు.
ఇటీవల నెట్ఫ్లిక్స్లో విడుదలైన నాయట్టు సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చిన నేపథ్యంలో అల్లు అరవింద్ ఈ సూపర్ హిట్ చిత్ర రైట్స్ను సొంతం చేసుకున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీంతో అల్లు అరవింద్కు చెందిన ఓటీటీ ఫ్లాట్ఫాం ఆహా పలు మలయాళ సినిమాలను తెలుగులోకి అనువదించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల కోసం డబ్ చేసి రిలీజ్ చేస్తారని అందరూ ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేసే పనిలో పడింది గీతా ఆర్ట్స్. తాజాగా ఈ విషయాన్ని నాయట్టు సినిమా దర్శకుడు మార్టిన్ ప్రక్కట్ అధికారికంగా ప్రకటించారు.
ఇక కథ విషయానికి వస్తే.. తాము చేయని హత్య కేసులో ముగ్గురు పోలీసు అధికారులు చిక్కుకుంటారు.ఈ కేసు నుంచి వాళ్లు బయటపడతారా? లేదా? చివరకు వాళ్ల జీవితం ఎలా మారింది? అనే కథాంశం చుట్టూ ఈ చిత్రం తిరుగుతుంది. ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ చార్లీకి దర్శకత్వం వహించిన మార్టిన్ ప్రక్కట్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా బాలీవుడ్ రైట్స్ను జాన్ అబ్రహమ్, తమిళ రైట్స్ను ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ సొంతం చేసుకున్నారు. ఈ సినిమాకు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తారనే ప్రచారం కూడా నడుస్తోంది. తెలుగులో ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు? సినిమాలో ఎవరు నటిస్తారనేది తెలియాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి