ఇల్లందకుంట: సొంత జాగా ఉండి ఇల్లు లేని నిరుపేదలకు త్వరలోనే రూ. 5లక్షలు ఇవ్వనున్నట్లు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో గూడులేని నిరుపేద ఉండొద్దనేదే సీఎం కేసీఆర్ ధ్యేయమని అన్నారు. ఇల్లందకుంట మండలం పాతర్లపల్లిలో బుధవారం ఆయన గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నదని చెప్పారు. సబ్బండ వర్ణాల అభివృద్ధికి సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నట్లు వివరించారు. 57 ఏళ్లు నిండినవారందరికీ కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే లక్షా 32వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. త్వరలో మరో 80 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.
దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళితబంధు పథకం అమలు చేస్తున్నట్లు సుంకె రవిశంకర్ చెప్పారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా ముందుకు పోతున్న సీఎం కేసీఆర్కు అంతా అండగా నిలువాలని కోరారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెల్లు శ్రీనివాస్యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. తన స్వార్థం కోసం ఈటల రాజేందర్ రాజీనామా చేస్తేనే ఈ ఎన్నికలు వచ్చాయని, తన అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు ఈటల బీజేపీలో చేరారన్నారు. సంక్షేమ సర్కారుపై అసత్యపు ఆరోపణలు చేస్తున్న ఈటలకు ఓటుతో బుద్ధిచెప్పాలని కోరారు.