గజ్వేల్, ఆగస్టు 30 : కాంగ్రెస్, టీడీపీ హయాంలో గజ్వేల్ ప్రాంతంలో గుక్కెడు తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించిన తర్వాత అన్ని సమస్యలు తీరడంతో పాటు ఈ ప్రాంతానికి మహర్దశ వచ్చిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మంగళవారం గజ్వేల్ మండలంలోని బెజుగామలో 20 కుటుంబాలు, శేరిపల్లిలో 20కుటుంబాలకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలు అందజేసి వారితో గృహప్రవేశాలు చేయించారు. అనంతరం గజ్వేల్లోని మహతి ఆడిటోరియంలో లబ్ధిదారులకు కొత్త పింఛన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్తో సాగునీరు పుష్కలంగా అందుబాటులోకి వచ్చిందన్నారు. గజ్వేల్లో ఎడ్యుకేషన్ హబ్లు, అద్భుతమైన రహదారులు, ప్రభుత్వ భవనాలు, ఆడిటోరియాలు, కార్పొరేట్ స్థాయిలో వైద్యసేవలు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. రేక్ పాయింట్ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఇంత అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్కు ఈ ప్రాంత ప్రజలంతా రుణపడి ఉండాలన్నారు.
ములుగు, ఆగస్టు 30 : రాష్ట్రంలో పోషకాహార లోపాన్ని అరికట్టేందుకు సెప్టెంబర్లో పోషణ మాసోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్నది. ఈ పోషణ మాసోత్సవంలో పోషకాహార లోపం ఉన్న చిన్నారులను, గర్భిణులను గుర్తించి సాధారణ స్థితికి తీసుకురావడానికి, పోషణ మాసోత్సవ నిర్వహణ కోసం సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన కేంద్రంలో మాహిళా, శిశుసంక్షేమ, వైద్యారోగ్యశాఖల ఆధ్వర్యంలో సంయుక్తంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మహిళాశిశు సంక్షేమశాఖ, వైద్యారోగ్యశాఖల కమిషనర్లు దివ్యదేవరాజన్, శ్వేతా మహంతి హాజరై సెప్టెంబర్లో నిర్వహించనున్న కార్యాచరణపై ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్తో కలిసి జిల్లా స్థాయి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మహిళా, శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యదేవరాజన్ మాట్లాడుతూ… భారతదేశంలో 20కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, రాష్ట్రంలో దానిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. పోషణమాసోత్సవంలో పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులను గుర్తించి వారికి పోషకాహారాన్ని అందించాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. మహిళల్లో పోషకాహార లోపం అనేక అనార్ధాలకు దారితీస్తున్నదని, దీనివల్ల వారికి పుట్టబోయే శిశువులు సైతం అనేక లోపాలతో జన్మిస్తున్నట్లు చెప్పారు. పోషకాహార లోపం లేకుండా తగు జాగ్రత్తలు పాటిస్తే శిశుమరణాలను సైతం అరికట్టవచ్చన్నారు. మహిళలు, శిశువుల్లో పోషకాహార లోపం నుండి సాధారణ స్థితికి తీసుకురావడానికి మహిళా, శిశు సంక్షేమశాఖ, వైద్యారోగ్యశాఖలకు చెందిన, రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్జీవన్ పాటిల్, వైద్యారోగ్య, మహిళా శిశుసంక్షేమ శాఖ జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి
ప్రశాంత్నగర్,ఆగస్టు 30: పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపన అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్ అన్నారు. మంగళవారం సిద్దిపేట ప్రశాంత్నగర్లోని నెహ్రూ యువ కేంద్రంలో ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను ఆయన పంపిణీ చేశారు. నెహ్రూ యువ కేంద్రం అసిస్టెంట్ ప్రోగ్రాం అధికారి జి.కిరణ్కుమార్, సెట్విన్ సిబ్బంది శ్రీనివాస్, బైరి చంద్రశేఖర్, లక్ష్మణ్, స్వాతి, జగదీశ్, రమేశ్ పాల్గొన్నారు.