మక్తల్ టౌన్, సెప్టెంబర్ 23 : రాష్ట్రంలో 18 ఏండ్లు నిండి.. ఆహార భద్రత కార్డు సభ్యులైన అందరికీ బతుకమ్మ చీరలను అందజేస్తామని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. దసరా పండుగ కానుకగా ప్రభుత్వ సారెగా చీరెలను అందిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం మక్తల్ క్యాంపు కార్యాలయంలో 16వ వార్డుల్లోని మహిళలకు బతుకమ్మ చీరెలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని ఆడపడుచులందరికీ బతుకమ్మ కానుకగా చీరలు అందించాలని లక్ష్యంతో చేనేత కార్మికులచే నేయించిన చీరెలను అందిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలో కుల, మత, జాతి, వర్గ బేధాభిప్రాయాలు లేకుండా అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం మక్తల్ మున్సిపాలిటీలో అర్హులైన లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ ప్రొసీడింగ్లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అలాగే ప్రభుత్వ బడుల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థినులకు 208 సైకిళ్లను ఎమ్మెల్యే అందజేశారు. కర్ణాటకలోని అరబిందో ఫార్మసీ కంపెనీ సౌజన్యంతో సైకిళ్లు అందించినట్లు తెలిపారు. కృష్ణ మండలం జెడ్పీ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ పరిధిలోని విద్యార్థినులకు 63, మాగనూర్ మండల పరిధిలో 30, అనుగొండ, జక్లేర్, కర్ని పాఠశాలలకు 38, మంథన్గోడ్, పాథర్చెడ్, నర్వ, పెద్ద కడ్మూర్, కల్వాల పాఠశాలలకు 77 సైకిళ్లను అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పావని, వైస్ చైర్మన్ అఖిల, కౌన్సిలర్లు శ్వేత, రాములు, మొగులప్ప, ఎంఈవో లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు అమరేందర్రెడ్డి పాల్గొన్నారు.