హైదరాబాద్ : సెప్టెంబర్ 2న రాష్ట్రంలోని ప్రతి, పల్లె, పట్టణంలో గులాబీ జెండా గుండెలనిండుగా ఎగరాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. 20 సంవత్సరాల కిత్రం జలదృశ్యం నుంచి కేసీఆర్ నేతృత్వంలో గుప్పెడు మందితో కలిసి ఒక్క అడుగుతో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సమతి ప్రస్థానం.. 20 ఏళ్ల విజయవంతమైన ప్రయాణంలో 2న ఢిల్లీలో పార్టీ కార్యాలయ శంకుస్థాపన సందర్భంగా సగర్వంగా టీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగురవేయబోతున్నదన్నారు. ఒకప్పుడు ఏ అస్థిత్వం కోసం ఢిల్లీ వీధుల్లో తెలంగాణ సమాజం గుండె చప్పుళ్లు ప్రతిధ్వనించాయో.. ఇప్పుడు అవే వీధుల్లో మన ఆత్మగౌరవ పతాకం ఆకాశమంత ఎత్తుకు ఎగురబోతున్నదన్నారు.
2001లో ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి, ఉద్యమ లక్ష్యమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాధించడంతో పాటు ప్రజల అభిమానాన్ని పొంది సీఎం కేసీఆర్ నాయకత్వంలో పార్టీ రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు. గత ఏడేళ్లుగా సీఎం కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ సాధనలో అనేక విజయాలు సాధించామని, దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా సంక్షేమం, అభివృద్ధి పథకాలతో ముందు వరుసలో నిలిచిందన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి తదితర పథకాలు అమలు చేస్తున్నారన్నారు. సెప్టెంబర్ 2న పల్లెలు, పట్టణాలలో టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వనిర్వహించి, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.