విశాఖపట్టణం : భారతదేశ ఆర్థిక వ్యవస్థలో నౌకాయాన రంగానిది కీలక పాత్ర అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారత నౌకాయాన రంగాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు మరింత కృషి జరగాల్సిన అవసరం ఉన్నదని ఆయన సూచించారు. విశాఖపట్నం పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతిని పోర్టు చైర్మన్ కే రామ్మోహన్ రావు, ఇతర అధికారులు కలిసి పోర్టు పురోగతికి సంబంధించిన వివిధ అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలిపారు. 103 ఎకరాల్లో రూ.406 కోట్లతో ఫ్రీ ట్రేడ్ అండ్ వేర్హౌజింగ్ జోన్ (ఎఫ్టీడబ్ల్యూజెడ్) ఏర్పాటుచేయనున్న విషయాన్ని వివరించారు. ట్రస్టు సాధిస్తున్న పురోగతిని ఉపరాష్ట్రపతి అభినందించారు.
ప్రపంచ వ్యూహాత్మక నౌకాయాన మార్గంలోనే భారతదేశం ఉండటం, దీనికి తోడు మన దేశానికి 7,517 కిలోమీటర్ల మేర తీరప్రాంతం ఉండటం, 200కు పైగా భారీ, చిన్న తరహా నౌకాశ్రయాలుండటం విశేషమని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారతదేశం ప్రాచీన కాలంలోనూ బలమైన నౌకాయాన వ్యవస్థను కలిగి ఉండేదన్న విషయాన్ని గుర్తుచేశారు. చోళ, కళింగ రాజుల వ్యాపార స్ఫూర్తితో నౌకాయాన రంగానికి పునర్వైభవం తీసుకురావాలన్నారు. భారతదేశంలో పోర్టుల ఆధారిత అభివృద్ధిని విస్తృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సాగర్మాల’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంతో 504 ప్రాజెక్టుల ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతున్నదని చెప్పారు.
2015-16 నుంచి 2019-20 వరకు కార్గో రవాణా విషయంలో విశాఖపట్టణం సాధించిన ప్రగతిని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి.. కరోనా మహమ్మారి కారణంగా కాస్త ఇబ్బందులు తలెత్తాయని, త్వరలోనే అన్నీ సర్దుకుని మళ్లీ విశాఖపట్టణం పోర్టు ప్రగతిపథాన పయనిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. విశాఖపట్టణం పోర్టులో సుస్థిరాభివృద్ధి కోసం ప్రపంచ స్థాయి మౌలికవసతుల కల్పన, పోర్టు ఆధారిత అభివృద్ధి, డిజిటైజేషన్ వ్యవస్థతోపాటు వివిధ పర్యావరణ పరిరక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పోర్టు ట్రస్టు చైర్మన్ కే రామ్మోహన్ రావు, డిప్యూటీ చైర్మన్ దుర్గేష్ కుమార్ దూబే, సీవీఓ ప్రదీప్ కుమార్ తోపాలు పలు విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.